ఎన్నికల్లో 140 సీట్లు: అక్కడ జగన్ ప్రభుత్వం!?
జూలై 30వ తేదిన తెలంగాణపై సిడబ్ల్యూసి నిర్ణయం వెలువడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఉద్యమం 35 రోజులుగా కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలమంటూ, సీమాంధ్రులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తోంది. ఇక విభజన నిర్ణయం కాంగ్రెసు పార్టీ తీసుకుంది.
అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమన్యాయం లేదా సమైక్యం అని మొదట చెప్పింది. రెండు రోజుల క్రితం సమైక్యాంధ్రకు సంపూర్ణ మద్దతు తెలిపింది. ఆ పార్టీ సమైక్యాంధ్రకు మద్దతు తెలపడం ద్వారా సీమాంధ్రలో ఎన్నికలు జరిగితే 140 సీట్ల వరకు గెలుచుకుంటుందని సర్వేలో తేలిందట.
సమైక్యాంధ్ర కోసం వైయస్ జగన్ జైల్లో, విజయమ్మ గుంటూరులో దీక్షలు చేపట్టారు. వారి దీక్షలను భగ్నం చేశారు. ఇప్పుడు షర్మిల సమైక్యాంధ్ర కోసం బస్సుయాత్ర చేపడుతున్నారు. జగన్ పార్టీ సమన్యాయం లేదా సమైక్యం అన్నప్పుడే 140 సీట్లు వచ్చిందని, ఇప్పుడు సమైక్యానికి పూర్తి మద్దతిస్తున్నందున ఇంకా పెరగవచ్చునని అంటున్నారు.
ఫలితాల ప్రకారం సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 60 శాతం, తెలుగుదేశం పార్టీకి 30 శాతం, కాంగ్రెసు పార్టికి 10 శాతం మద్దతు పలికారట. విభజన జరిగితే ఆ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని సర్వేలో తేలింది. కొత్త ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తే 140కి పైగా సీట్లు గెలిచి, జగన్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, జగన్ ముఖ్యమంత్రి అవుతారని సర్వేలో తేలింది.
అయితే, ఈ సర్వేలు అటు ఇటు కాకపోయే అవకాశాలు లేకపోలేదని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం ఉద్యమ సెగ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నందున సెంటిమెంట్ దృష్ట్యా ఆ పార్టీకి మద్దతు పలకవచ్చునని, ఎన్నికల నాటికి అది తగ్గవచ్చునని అంటున్నారు. సీమాంధ్రలో 175 అసెంబ్లీ స్థానాలున్నాయి.
అంతేకాకుండా విభజన నిర్ణయం ఆలస్యం లేదా త్వరగా పూర్తయ్యే అంశంపై కూడా ఆధారపడి ఉందని అంటున్నారు. మరోవైపు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఆత్మగౌరవ యాత్రతో ప్రజలకు ఎవరు అసలు దోషులో చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని అవి జనంలోకి వెళ్తే టిడిపికి మద్దతు పెరుగుతుందని, కాంగ్రెసు నేతల దీక్షలు, రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనడం ద్వారా కాంగ్రెసు పార్టీకి కూడా మద్దతు పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. అంతేకాకుండా విభజన జరిగితే సీమాంధ్రలో ఏర్పడబోయే రాజధాని విషయంలో జగన్ ఏ నగరానికి మద్దతిస్తారనే అంశం ప్రభావం చూపనుందంటున్నారు.