చైనాకే మన అవసరం, పరుగులు పెట్టాం: చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఒకే భవంతిలో ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకు ఇరవై అంతస్తులతో ఆకాశహర్మ్యాలు నిర్మించాలని భావిస్తున్నారు. ఈ నిర్మాణంలో పాలుపంచుకునేందుకు చైనా కంపెనీ ఆసక్తి కనబరుస్తోంది.
కాగా, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు ఆరు రోజుల పర్యటన వివరాలు వివరించారు. పలువురు అధికారులతో సమావేశమయ్యారు. చైనాలో భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు స్థానికంగా వ్యాపార అవకాశాలు తగ్గాయని, ఇతర ప్రాంతాలకు విస్తరిస్తేనే అవి నిలబడగలుగుతాయని, వచ్చే రెండు దశాబ్దాల్లో పెరిగే మార్కెట్ మనదేనని చంద్రబాబు అన్నారు.
వాళ్లకు మన అవసరం ఉందన్నారు. మనకు కూడా పెట్టుబడులు, టెక్నాలజీ కావాలన్నారు. మన కంపెనీలు కూడా చైనా కంపెనీల స్థాయికి ఎధగాలన్నారు. అందుకు ప్రాథమిక దశలో కలిసి ప్రయాణం చేయడం తప్పనిసరి అన్నారు. ఇద్దరికీ ఎవరి అవసరాలు వారికి ఉన్నందున చైనా నుంచి మనకు పెట్టుబడులు రావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.
చంద్రబాబు
నవ్యాంధ్రపై చైనాలో బాగా ఆసక్తి ఉందని, కానీ, పెట్టుబడులు తరలిరావడం కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉందని చెప్పారు. వారికి కొన్ని కోరికలు ఉన్నాయని, భారత్లో దిగిన వెంటనే వీసా ఇచ్చే సదుపాయం, దేశం అంతటా ఒకే విధమైన పన్ను విధానాలు, వ్యాపార నిర్వహణకు సరళ విధానాలు కావాలని కోరుతున్నారని, వీటిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
చంద్రబాబు
వచ్చే నెలలో ప్రధాని మోడీ చైనాకు వెళ్తున్నారని, ఆ తర్వాత వీటిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అలాగే, చైనా నుంచి ఏయే రంగాల్లోకి పెట్టుబడులు ఆహ్వానించాలన్న దానిపైనా కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. తన పర్యటనపై తాను త్వరలో ప్రధానిని కలిసి వివరిస్తానని చెప్పారు. తాను చైనాలోని మూడు నగరాలు బీజింగ్, షాంఘై, చెంగ్డు నగరాలను సందర్శించానని, మొత్తం 29 ఎంవోయూలు కుదిరాయన్నారు.
చంద్రబాబు
వాటిలో ఇరు ప్రభుత్వాల మధ్య ఎనిమిది, ప్రభుత్వానికి, వ్యాపార సంస్థలకు మధ్య 10, ఇరు దేశాల్లోని వ్యాపార సంస్థల మధ్య 11 ఎంవోయూలు కుదిరాయని చెప్పారు. హైదరాబాద్లో పని చేసిన మాదిరిగా అక్కడ కూడా అర్ధరాత్రి వరకూ అందరినీ కలిసి మాట్లాడుతూనే ఉన్నామని, తనతోపాటు వచ్చిన అధికారులు కూడా బాగా పని చేశారన్నారు.
చంద్రబాబు
ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉరుకులు పరుగులతో పని చేశామని, అధికారులకు అక్కడ కనీసం చాక్లెట్లు కొనుక్కోవడానికి కూడా సమయం చాలలేదని, తాము ఎంత కష్టపడినా రాష్ట్రం బాగుపడాలన్నదే తమ తపన అని వివరించారు. సిచువాన్ ప్రావిన్స్లో తొమ్మిది కోట్ల జనాభా ఉంటే రెండు కోట్ల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించారని, వ్యవసాయ దిగుబడులు కూడా మనతో పోలిస్తే బాగా ఎక్కువన్నారు.
చంద్రబాబు
రాష్ట్రంతో అవగాహన కుదుర్చుకొని వారి అనుభవాలను వాడుకోవాలన్న యోచనతో ఒక ఎంవోయూ కుదుర్చుకొన్నామన్నారు. భారీ డ్యాంల నిర్మాణంలో చైనా కంపెనీలకు బాగా అనుభవం ఉందని, కేంద్రంతో మాట్లాడి పోలవరం నిర్మాణంలో వారి టెక్నాలజీని వాడుకొనే ఆలోచన చేస్తామని చంద్రబాబు చెప్పారు. టెక్నాలజీలో చైనా సంస్థలు అద్భుత ప్రగతిని సాధించాయని, దానిని వాడుకోగలిగితే మన వద్ద ఫలితాలు చాలా బాగా ఉంటాయన్నారు.
చంద్రబాబు
చైనాతో సరిహద్దు వివాదాల వంటి వాటిని మరీ అంత పెద్ద అంశాలుగా పరిగణించడం వల్ల ఉపయోగం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మనం మన శక్తిపై ఆధారపడాలని, అందరితో మంచి సంబంధాలు పెట్టుకోవాలని, ఆ పనిని ప్రధాని మోడీ బాగా చేస్తున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఏ ప్రధానీ తేనంత స్థాయిలో ఆయన దేశానికి గుర్తింపు తెచ్చారన్నారు.
చంద్రబాబు
దేశాన్ని బ్రహ్మాండంగా మార్కెటింగ్ చేస్తున్నారన్నారు. 15 ఏళ్ల కిందట ఒక స్థాయిలో తాను ఆ పని చేశానని, చిన్న విషయాలను కాకుండా మన దేశం శక్తిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
చంద్రబాబు
మనం విఫలమైతే తప్ప రాబోయే రోజుల్లో చైనా, భారత్, అమెరికా వరుసలో అగ్ర దేశాలుగా నిలుస్తాయన్నారు. మన దగ్గర ప్రజలు అభివృద్ధిని కోరుకొంటున్నారని, రాజకీయ నాయకులే చిన్న విషయాలను పెద్దవిగా చేసి అభివృద్ధిని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారన్నారు.