ఆ మారణహోమానికి 33ఏళ్లు: జంతువుల్లా వేటాడారు!, అప్పటి కన్నీటి జ్ఞాపకాలివి..
అల్లరి మూకలు మరింత రెచ్చిపోతుండటంతో.. పక్కనే ఉన్న ఓ ముస్లిం కుటుంబం.. తనకూ, తన ముగ్గురు పిల్లలకు ఆశ్రయం కల్పించిందన్నారు.
న్యూఢిల్లీ: అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్లో తిష్ట వేసిన ఖలిస్తాన్ వేర్పాటు వాదులను అణచివేయడానికి 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జరిపిన ఆపరేషన్ బ్లూ స్టార్ ఎంతోమంది సిక్కుల ప్రాణాలను బలిగొంది.
ఆపరేషన్ బ్లూ స్టార్కు ప్రతీకారంగా 1984, అక్టోబర్ 31న ఇందిరాగాంధీ బాడీ గార్డులైన ఇద్దరు సిక్కులు ఆమెను హత్య చేశారు. ఇందిరా హత్యానంతరం ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో తీవ్ర అల్లర్లు చెలరేగాయి.
ఢిల్లీలో తీవ్ర మారణహోమం జరిగింది. ఈ మారణహోమంలో సుమారు 3వేల మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఈ మారణహోమం జరిగి నేటికి 33ఏళ్లు. దానికి ప్రత్యక్ష సాక్షి అత్తార్ కౌర్.
ఆ మారణ హోమానికి 33ఏళ్లు:
33ఏళ్ల నాటి మారణకాండపై అత్తార్ కౌర్ తాజాగా ఓ పంజాబీ పత్రికతో మాట్లాడారు. సిక్కులపై జరిగిన ఊచకోతలో అత్తార్ కౌర్ భర్తతో సహా 11 మంది కుటుంబ సభ్యులు హత్య గావించబడ్డారని కన్నీరుమున్నీరయ్యారు.
ఆ సమయంలో తాము ఢిల్లీలోని త్రిలోకపురిలో నివాసముండేవారమని, ఇందిర హత్యానంతరం అల్లరి మూకలు నేరుగా తమ నివాసాలపై దాడికి దిగారని గుర్తుచేసుకున్నారు.
రెచ్చిపోయిన అల్లరిమూకలు:
అత్తార్ కౌర్ భర్త చిన్నా చితక వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆరోజు ఏదో పని మీద అప్పుడే గురుద్వారాకు వెళ్లాడు. ఇంటి ముందు ఏడుగురు చిన్నారులు, వారి స్నేహితులు కలిసి ఆడుకుంటున్నారు. అత్తార్ కౌర్ అత్తా, మామ కూడా ఇంటి బయటే ఉన్నారు. ఇంతలో అక్కడికి చేరుకున్న అల్లరిమూకలు.. ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డారు.
జంతువులను వేటాడినట్టే:
తన రెండు నెలల పసిబిడ్డతో సహా, ఆరుగురు చిన్నారులను, భర్త, అత్తమామలతో సహా 11 మంది కుటుంబ సభ్యులను అల్లరి మూకలు పొట్టన పెట్టుకున్నాయని అప్పటి విషాదాన్ని గుర్తుచేసుకున్నారు. అత్యంత దారుణంగా హత్యకు పాల్పడ్డారని చెప్పారు. జంతువులను వేటాడినట్టే తమనూ వెంటాడారని, కొంతమందిని చిత్రహింసలు పెట్టి.. సజీవ దహనం చేశారని తెలిపారు.
ఆశ్రయమిచ్చిన ముస్లిం కుటుంబం:
అల్లరి మూకలు మరింత రెచ్చిపోతుండటంతో.. పక్కనే ఉన్న ఓ ముస్లిం కుటుంబం.. తనకూ, తన ముగ్గురు పిల్లలకు ఆశ్రయం కల్పించిందన్నారు.
సాయంత్రం ట్రిపోలి రహదారి పక్కన పిల్లల మృత దేహాలు, దహనమైన అత్త, మామలు, భర్త మృతదేహాన్ని చూశానని కన్నీటిపర్యంతమయ్యారు. ఆనాటి హత్యాకాండను తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుందన్నారు.