బాబు, జగన్లకు షాక్!: మరో రెండు కొత్త పార్టీలు
కిరణ్ అధిష్టానానికి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవగా.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ నేత, తెలుగు సాంకేతిక విభాగం అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఝలక్ ఇవ్వనున్నారు. ఇక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాకిస్తూ వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా రాజన్న దళం పార్టీ పుట్టుకు వచ్చింది.
టిడిపి నేత పాలెం శ్రీకాంత్ రెడ్డి పార్టీని వీడే యోచనలో ఉన్నారు. ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించిన ఆయన కొంతకాలంగా కొన్ని స్వచ్చంద సంస్థలు, ప్రజాసంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నెలాఖరులోపు తుది నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
2009 ఎన్నికల్లో కడప లోక్సభ స్థానంలో టిడిపి తరఫున జగన్పై శ్రీకాంత్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్యామ్నాయ రాజకీయాలపై తాను ఇటీవల వివిధ వర్గాల వారితో చర్చించిన మాట వాస్తవమని ఆదివారం కొందరు విలేకరులతో ఆయన చెప్పారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రజల ఆలోచనా సరళిలో మార్పు తెచ్చాయని, డబ్బు ప్రభావంలేని కొత్త రాజకీయాలను ప్రజలు కోరుకుంటున్నారని ఈ ఫలితాలు రుజువు చేశాయని అన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన నూతన పార్టీ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఆయన కొత్త పార్టీని స్థాపించే అవకాశాలున్నాయి. పార్టీకి ఏం పేరు పెట్టాలనే దానిపై చర్చిస్తున్నారు. గతంలో శ్రీకాంత్ రెడ్డి యువపథం పేరుతో యాత్ర చేపట్టారు. దీంతో కొత్తగా పెట్టబోయే పార్టీకి అలాంటి పేరు పెడితే బాగుంటుందని పలువురు సూచించారు. జనపథం, మనపథం లాంటి పేర్ల పైనా చర్చిస్తున్నారు. మరోవైపు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా రాజన్న దళం పార్టీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ అధ్యక్షులు చిరంజీవి రెడ్డి వెల్లడించారు.