బాబుకు అమిత్ షా దూరం: మతలబు ఏమిటి?
హైదరాబాద్: తమ మిత్రుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా కలుసుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పార్టీ కార్యకలాపాల్లో గురువారంనాడు తీరిక లేకుండా గడిపిన అమిత్ షా చంద్రబాబుతో మాత్రం భేటీ కాలేదు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చిన ఆయన గురువారమంతా హైదరాబాదులోనే ఉన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ తెలుగుదేశం, బిజెపి ప్రభుత్వాల్లో కలిసి పనిచేస్తున్నాయి..
చంద్రబాబు నాయుడు గురువారంనాడు హైదరాబాదులోనే ఉన్నారు. అమిత్ షా భేటీ కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే, అమిత్ షా బిజీగా ఉన్నారంటూ వారికి బిజెపి నుంచి సమాధానం వచ్చినట్లు చెబుతున్నారు. గురువారంనాడు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసిన అమిత్ షా సాయంత్రం విజయవాడకు బయలుదేరి వెళ్లారు.
2019 నాటికి పూర్తి స్థాయిలో బలం పుంజుకోవాలనే వ్యూహంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి బిజెపి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని అంటున్నారు. పైగా, తెలంగాణలో చంద్రబాబునాయుడికి వ్యతిరేకత ఉందనే భావన బలంగా ఉంది. చంద్రబాబు నాయుడితో సాన్నిహిత్యం వల్ల తెలంగాణలో తమ పార్టీ బలం పుంజకోవడం కష్టమనే ఆలోచన కూడా వారిలో ఉన్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు భేటీకి గురువారంనాడు ప్రయత్నాలు జరిగాయని, అయితే అది తమ ఎజెండాలో లేదని, రెండు రాష్ట్రాల్లోనూ తాము బలపడాలని అనుకుంటున్నామని, అందువల్ల టిడిపి నాయకులతో భేటీ కావడం తమకు ప్రధానమైన విషయం కాదని బిజెపి నాయకులు అంటున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. విజయవాడలో కూడా తెలంగాణలో మాదిరి సమావేశమే ఉంటుందని, టిడిపితో సమన్వయ సమావేశం ఏదీ ఉండదని చెబుతున్నారు. కాగా, అమిత్ షా చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడినట్లు చెబుతున్నారు.