ముందస్తు ఎన్నికలకు మోడీ: పవన్ కల్యాణ్కు సంకేతాలు?
Recommended Video
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా హిందూస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఆ విషయాన్ని తెలియజేస్తోంది.
కర్ణాటక ఫలితాలను బట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లే విషయంపై నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. కర్ణాటక శాసనసభకు ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి. లోకసభతో పాటు 8 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆరు నెలల ముందే ఎన్నికలు...
ఆరు నెలలు ముందుగానే లోకసభకు, 8 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించే యోచనలో మోడీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. తమ పార్టీకి దేశమంతా అనుకూల వాతావరణం ఉందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ పార్టీ గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తుందని అమిత్ షా హిందూస్థాన్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
ఉంటే మీకు చెప్తానా.
లోకసభతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారా అని అడిగితే అటువంటిది ఏమైన ఉంటే మీకు చెబుతానని అనుకున్నారా అని అమిత్ షా ఎదురు ప్రశ్న వేశారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలను బట్టి మోడీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
తెలంగాణలో ఉనికి చాటుతాం...
తెలంగాణలో తమ పార్టీ ప్రవేశించడానికి అవసమైన వెసులుబాట్లు లభిస్తున్నాయని అమిత్ షా అన్నారు. లోకసభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటకలో విజయం మాదేనని...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ ఈ రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్లో నాలుగోసారి, రాజస్థాన్లో రెండోసారి తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. ఢిల్లీలో 20 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
పవన్ కల్యాణ్కు ముందస్తు సంకేతాలు...
ముందస్తు ఎన్నికలకు సంబంధించిన సంకేతాలు జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అందినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన రెండు సినిమాలు చేయాలనే ఆలోచనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఆ రెండు సినిమాల కోసం తీసుకున్న అడ్వాన్స్ను వెనక్కి ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు చెబుతున్నారు.