ఏపీ, తెలంగాణ..అంబానీ బ్రదర్స్:బాబుకి కేటీఆర్ ఊరట
హైదరాబాద్: విభజనతో ఇరు రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) అభివృద్ధి చెందుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం అన్నారు. ఆంధ్రలో ఓడ రేవులు, విమానాశ్రయాలు వస్తున్నాయని, కొత్త రాజధాని పేరుతో అభివృద్ధికి బీజం ఏర్పడిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎప్పుడో చెప్పినట్లు, రెండు తెలుగు రాష్ట్రాలు నేడు అంబానీ సోదరుల్లా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. తెలంగాణ భవన్లో టిడిపి శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ మొవ్వ సత్యనారాయణ, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడాలి రవిలు టిఆర్ఎస్లో చేరారు.
వీరు మంత్రులు కెటిఆర్, తుమ్మల నాగేశ్వర రావు, మహేందర్ రెడ్డిల సమక్షంలో కారు ఎక్కారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని తాము కోరుకుంటున్నామని చెప్పారు.

రాష్ట్రం విడిపోతే హైదరాబాదులో ప్రాంతేతరుల పైన దాడులు జరుగుతాయని దుష్ప్రచారం చేశారన్నారు. పదిహేను నెలల్లో ఏనాడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. ఓట్ల తొలగింపు అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
వాస్తవానికి 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 67 లక్షల మంది ఉంటే ఓటర్లు అంతకన్నా తక్కువ మంది ఉండాలన్నారు. కానీ 72 లక్షల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. దీంతో సరి చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు. నవంబర్ నాటికి హైదరాబాద్ తాగునీటి ఇబ్బందులను తీరుస్తామన్నారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుస్తుందన్నారు. స్వరాష్ట్ర ఏర్పాటు సమయంలో హైదరాబాద్లో ప్రాంతేతరులకు స్థానం ఉండదని, శాంతిభద్రతల సమస్య వస్తుందని, సీమాంధ్రుల్ని తరిమేస్తరని కొందరు రాజకీయ నాయకులు విష ప్రచారం చేశారన్నారు. కానీ అది అబద్దమని ఇప్పుడు తేలిందన్నారు.
రాజకీయ నాయకులకు వాక్శుద్ధి కంటే చిత్తశుద్ధి ముఖ్యమన్నారు. కేసీఆర్ రాజనీతిజ్ఞుడని, హైదరాబాద్లో ఉండేవారంతా తెలంగాణ బిడ్డలేనని, శాంతిభద్రతల సమస్య ఉండదని ఎన్నికల ప్రచారంలోనే చెప్పారన్నారు. ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు.
అన్నదమ్ముల్లా విడిపోయినా ప్రజలుగా కలిసుందామని, భవిష్యత్తులోనూ అందరం ఇదే సంప్రదాయాన్ని కొనసాగిద్దామన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అయ్యప్ప సొసైటీ ఆక్రమణలను కూల్చివేస్తే కొన్ని పార్టీలు గగ్గోలు పెట్టాయని, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఇళ్లను కూల్చేస్తున్నారని చిల్లర ప్రచారం చేశారన్నారు.
చట్టవిరుద్ధంగా వెలిసిన ఆక్రమణలు, విచ్చలవిడితనంతో వెలిసిన కట్టడాలపై చర్యలు తీసుకోవాలని భావించి అక్కడ కూల్చివేతలు జరిపామని, ఇందులో రెండు రాష్ర్టాలకు సంబంధించిన వాళ్లు ఉన్నారన్నారు. హైదరాబాద్లో సీమాంధ్రుల ఓట్లు తొలగిస్తున్నారని విషప్రచారం చేస్తున్నారన్నారు.
దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ను వివరాలు అడిగితే ఆశ్చర్యం కలిగే వాస్తవాలు తెలిశాయని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 67 లక్షల జనాభా ఉంటే 72 లక్షల ఓట్లు ఉంటాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
రెండు రాష్ర్టాలుగా విడిపోయిన తర్వాత ఏపీ ప్రజలంతా కేసీఆర్ ఫొటో పెట్టుకుని మొక్కుతున్నారని, కృష్ణా, గుంటూరుకు చెందినవారంతా భూముల రేట్లు విపరీతంగా పెరిగాయని ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో రెండు రాష్ర్టాలు నంబర్ 1, 2లుగా అభివృద్ధి చెందాలన్నారు.
అంబానీ సోదరులుగా రెండు రాష్ర్టాలు గణనీయమైన అభివృద్ధిగాంచాలని, ముకేశ్ అంబానీలా తెలంగాణ రాష్ట్రం ముందుండాలన్నారు. హైటెక్కులంటూ హైదరాబాద్కు అది చేశామని, ఇది చేశామని చెప్పుకొనేటోళ్లు వర్షపు నీరు, ట్రాఫిక్ చూస్తే వారేం చేశారో తెలుస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం అందకారమవుతుందని పటంలో కర్ర పట్టుకుని చెప్పిన అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితమే అంధకారమైందని, మన రాష్ట్రం దేదీప్యమానంగా నిరంతర విద్యుత్తో వెలుగుతోందన్నారు. సంవత్సరం తిరక్కుండానే కోతల్లేని కరెంట్ అందించిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు.












Click it and Unblock the Notifications