అమిత్షా మిషన్: తెలంగాణలో మాస్టర్ ప్లాన్ ఇదీ...
తెలంగాణపై అమిత్ షా దృష్టి కేంద్రీకరించారు. తెలంగాణలో బలం పుంజుకోవడానికి ఆయన మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఆ మాస్టర్ ప్లాన్ ఇలా ఉంటుంది....
న్యూఢిల్లీ/ హైదరాబాద్: గత ఎన్నికల్లో మాదిరిగానే వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ సంచలన విజయాలు సాధించాలని బీజేపీ తలపోస్తున్నది. జాతీయ స్థాయిలో గత ఎన్నికల్లో గెలుపొందిన అన్ని స్థానాల్లోనూ తిరిగి విజయాలు సాధించడం ఏ పార్టీకైనా అసాధ్యమే కనుక ప్రత్యామ్నాయంగా ఇతర స్థానాల్లో పట్టు సాధించాలని కమలనాథులు తలపోస్తున్నారు.
ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోక్సభ స్థానం మొదలు మెదక్, నిజామాబాద్, వరంగల్, భువనగిరి, కరీంనగర్, మహబూబ్ నగర్ లోక్సభ స్థానాలపై గురి పెట్టింది బీజేపీ. కానీ హైదరాబాద్ మినహా అన్ని స్థానాల్లోనూ అధికార టీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం.
గురువారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించిన తర్వాత మరుసటి రోజు నుంచి వారం పాటు 'సామాజిక సమర్థత వారోత్సవాలు' నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ తెలిపారు. ఆ క్రమంలో భాగంగా హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంపైనే ప్రధానంగా ద్రుష్టిని కేంద్రీకరిస్తున్నట్లు తెలుస్తున్నది.
యూపీ ఎన్నికల విజయాలే స్ఫూర్తిగా
ఇటీవల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ముస్లింల జనాభా అత్యధికంగా గల పశ్చిమ యూపీ బెల్టులోనూ బీజేపీ విజయం సాధించిన వైనం తెలంగాణలో పార్టీ నాయకత్వానికి స్ఫూర్తినిస్తున్నట్లు తెలుస్తున్నది. బీజేపీ వ్యతిరేక పార్టీలు ఎస్పీ - కాంగ్రెస్ కూటమి, బీఎస్పీ మధ్య ముస్లిం ఓట్లు చీలిపోగా హిందూ ఓట్లు సంఘటితంగా పోలవ్వడంతో బీజేపీ ఘన విజయాలు సాధించగలిగింది. ఇదే ఫార్ములానూ తెలంగాణలోనూ అమలు చేయాలని కమలనాథులు భావిస్తున్నారు.
బలమున్న ప్యాకెట్లలో పటిష్ఠం
దీనికి తోడు ఆ పార్టీకి గతంలో తెలంగాణలోని వివిధ ప్యాకెట్లలో బలం కూడా ఉన్నది. హైదరాబాద్ లోక్సభా నియోజకవర్గ పరిధిలో మజ్లిస్ పార్టీతోపాటు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను నిలిపినా.. ఎంఐఎం, బీజేపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొని ఉండటం గమనార్హం. ఎట్టి పరిస్థితుల్లోనైనా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు రాజకీయాలకు అతీతంగా పాతబస్తీలోని ప్రముఖులతో శుక్రవారం బీజేపీ సదస్సు నిర్వహిస్తు్నది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగే ఈ సదస్సులో హైదరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో బలోపేతానికి.. మజ్లిస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనడానికి గల అవకాశాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మెదక్ నుంచి రెండుసార్లు
హైదరాబాద్ తర్వాత బీజేపీ కీలకంగా భావిస్తున్న స్థానాల్లో మెదక్ లోక్సభా నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించింది. ఆ పార్టీ నేతగా అలె నరేంద్ర పోటీ చేయడంతోపాటు ఎంపీగా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున గెలుపొందడంతోపాటు కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అదే ఎన్నికల్లో సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్గా బీజేపీ తరఫున ఎన్నికైన జగ్గారెడ్డి కూడా టీఆర్ఎస్ నుంచే సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అదినేత.. ప్రస్తుతం తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు విజయం సాధించినా.. రాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించడంతో మెదక్ లోక్సభ స్థానానికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డి పోటీ చేసినా.. టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు.
పీవీని ఓడించిన జంగారెడ్డి
1984లో తెలుగుదేశం పార్టీ హవాలో జరిగిన లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక కూటమిగా ప్రతిపక్షాలు పోటీ చేశాయి. ఈ క్రమంలో హన్మకొండ నుంచి నాటి కేంద్రమంత్రి.. తర్వాత ప్రధానిగా బాద్యతలు నిర్వర్తించిన తెలుగుతేజం పీవీ నర్సింహారావును 1984 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పీ జంగారెడ్డి మట్టి కరిపించారు. నాటి నుంచి అడపా దడఫా బీజేపీ మళ్లీ హన్మకొండలో పాగా వేసేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నది. మళ్లీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో హన్మకొండలో సత్తా సాటేందుకు ముందస్తుగా వ్యూహ రచన చేస్తున్నది.
చెన్నమనేని పలుకుబడి కీలకం
కరీంనగర్ లోక్సభా స్థానం నుంచి 1998, 1999 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలుపొందిన చెన్నమనేని విద్యాసాగర్ రావు.. తర్వాత కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరీంనగర్ లోక్సభా నియోజకవర్గ పరిధిలో చెన్నమనేని విద్యాసాగర్ రావు సామాజిక వర్గానికే ఎక్కువ పట్టు ఉన్నది. ఈ సామాజిక వర్గంలో పట్టు సాధించడంతోపాటు ప్రజల సమస్యలపై పని చేయగలిగితే విజయం సాధించే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు చెప్తున్నారు.
పాలమూరు, ఇందూరులపై ఫోకస్
మహబూబ్ నగర్ నుంచి గతంలో బీజేపీ నుంచి గెలుపొందిన ఏపీ జితేందర్ రెడ్డి.. ప్రస్తుతం లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేతగా ఉన్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నాగం జనార్ధన రెడ్డి గత ఎన్నికల్లో జితేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. నిజామాబాద్ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణకు ఇప్పటికీ నిజామాబాద్లో పట్టు ఉన్నది. ఇక భువనగిరి, మల్కాజిగిరి లోక్ సభ స్థానాలపైనా బీజేపీ గురి పెట్టినట్లు తెలుస్తున్నది. ఈ నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 14న బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో బీజేపీ నేతలు పాల్గొననున్నారు. హైదరాబాద్ నగరంలో జరిగే కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, నిజామాబాద్లో జరిగే కార్యక్రమానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హాజరు కానున్నారు.
అస్త్రంగా ముస్లింల రిజర్వేషన్
ఇక తెలంగాణలో పట్టు పెంచుకునేందుకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్దమవుతున్నది. ఇందుకోసం ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టడాన్ని వ్యతిరేకించినందుకు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది అధికార పక్షం. మరోవైపు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏబీవీపీ కూడా హైదరాబాద్లో ప్రదర్శన కూడా నిర్వహించింది. తాజాగా కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడు కూడా మత ప్రాతిపదికన రిజర్వేషన్ల కల్పనకు వ్యతిరేకమన్నారు. రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ ఆమోదించి.. గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదానికి పంపితే అసలు కథ మొదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి తాము వ్యతిరేకమని కమలనాథులు అంటున్నారు.