భారతీయుల చర్మ రంగులకు కారణం ఇదే!
సీసీఎంబీ పరిశోధనలో తేలిన విషయమేమంటే.. మన దేశంలో మనుషుల చర్మ రంగు వైవిధ్యానికి ప్రత్యేకమైన జన్యువు కారణం.
హైదరాబాద్: ప్రపంచంలోని చాలా దేశాల్లోని పౌరులందరూ రంగులో దాదాపు ఒకే పోలికలు కలిగి ఉంటారు. కానీ, మనదేశంలో మాత్రం నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లోనూ ప్రజలు కనిపిస్తారు. ఈ విషయంపై పరిశోధన చేసిన సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) అందుకు కారణాలను కనుగొంది.
సీసీఎంబీ పరిశోధనలో తేలిన విషయమేమంటే.. మన దేశంలో మనుషుల చర్మ రంగు వైవిధ్యానికి ప్రత్యేకమైన జన్యువు కారణం. సీనియర్ ప్రిన్స్పల్ శాస్త్రవేత్త డాక్టర్ కె తంగరాజ్ నేతృత్వంలో వేర్వేరు దేశాల్లోని ఐదు ఇతర సంస్థలతో కలిసి దీనిపై చేసిన తాజా పరిశోధన పత్రం 'ది జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీ' ఆన్లైన్ ఎడిషన్లో నవంబర్ 17న ప్రచురితమైంది.
ఆఫ్రికా దేశాల్లో నలుపు, ఐరోపాలో తెల్లవాళ్లు ఎక్కువగా ఉంటే భారత్లో మాత్రం నలుపు, తెలుపు, ఎరుపు ఇలా వేర్వేరు వర్ణాల్లో ప్రజలు ఉన్నారు. చర్మ రంగులో ఈ వైవిధ్యానికి మెలనిన్ అనే పిగ్మెంట్ ప్రధాన కారణమని మొదట భావించేవారు.

అయితే, చర్మ వర్ణంలో తేడాలకు జన్యుమార్పునకు సంబంధం ఉందని ఎస్ఎల్సీ24ఏ5 అనే జన్యువును గతంలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. దాన్ని ఆధారంగా ఆఫ్రికా, యూరోపియన్ల వర్ణంలో దాదాపు 25-38శాతం మార్పు కనబడుతోందని పరిశోధనలో తేలింది.
తాజా పరిశోధనలో ముఖ్యంగా మన దేశంలో వేర్వేరు చర్మ రంగులు ఉండటానికి మరో ప్రత్యేకమైన జన్యువు ఆర్ఎస్2470102 కారణమని పరిశోధకులు కనుగొన్నారు. తాజా పరిశోధన భవిష్యత్తులో వ్యక్తిగత ఔషధాలను సూచించేందుకు ముందడుగు అవుతుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. మరిన్ని అంశాల్లో విస్తృత పరిశోధనలకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని వివరించారు.












Click it and Unblock the Notifications