జగన్తో భేటీ: రామోజీరావుపై చంద్రబాబు అసంతృప్తి?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఈనాడు అధినేత రామోజీ రావు భేటీ కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. రామోజీ రావును తీవ్రమైన చిక్కుల్లో పడేసేందుకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. మార్గదర్శి ఉదంతంతో ఆయనను ఇబ్బందులు పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించారు. వైయస్ ప్రోత్సాహంతో అప్పటి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి వ్యవహారంపై నిత్యం రామోజీరావుపై ధ్వజమెత్తుతూ వచ్చారు.
అంతేకాకుండా, సాక్షి మీడియాను స్థాపించిన వైయస్ జగన్ కూడా మాటల్లోనే కాకుండా మీడియా ద్వారా కూడా రామోజీరావుపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించారు. రామోజీరావుకు వ్యతిరేకంగా సాక్షి దినపత్రికలో పలు వార్తాకథనాలను ప్రచురించారు. ఇవన్నీ మరిచిపోయి జగన్తో రామోజీ రావు ఎలా భేటీ అయ్యారనేది చంద్రబాబు అసంతృప్తిగా చెబుతున్నారు. ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తాకథనం కూడా ఆ విషయాన్ని పట్టిస్తోంది.
తాను ఓ శుభ కార్యానికి ఆహ్వానించడానికి రామోజీ రావు వద్దకు వెళ్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి చెప్పడంతో తాను కూడా వస్తానని చెప్పి జగన్ బయలుదేరినట్లు చెబుతున్నారు. ముందు నిర్ణయం ప్రకారం జగన్ రామోజీ రావుతో సమావేశం కాలేదని చెప్పడానికి ఈ వాదన ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు.
రామోజీరావు సలహా తీసుకోవడానికే జగన్ వెళ్లారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెబుతున్నారు. ఏ వాదనలో ఎంత నిజం ఉందనే విషయాన్ని పక్కన పెడితే జగన్, రామోజీరావుల మధ్య భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పుతాయనే అభిప్రాయం మాత్రం బలంగానే వ్యక్తమవుతోంది.
దీక్షకు అనుమతి నిరాకరిస్తూ చంద్రబాబు జగన్పై ఢిల్లీలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా జగన్ను తీవ్రమైన దెబ్బ తీయడానికి పన్నిన వ్యూహం రామోజీ భేటీ వల్ల దెబ్బ తిన్నదనే అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో ఉంది. దీక్ష నుంచి రామోజీ రావు సలహా వల్లనే జగన్ వెనక్కి తగ్గారని భావిస్తున్నారు. రాష్ట్రానికి మేలు చేయాలని చూస్తుంటే జగన్ అడ్డుపడుతున్నారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ అనుసరిస్తూ వస్తోంది. అనుమతి నిరాకరించినా దీక్షకు దిగాలనే ప్రయత్నిస్తే సంభవించే పరిణామాలకు జగన్ను బాధ్యుడిని చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. రామోజీ భేటీ వల్ల అది జరగలేదని అంటున్నారు.