'కాపు'కి ఎక్కడో?: మోడీ టీంరేస్లో టిడిపి నుండి..
హైదరాబాద్/న్యూఢిల్లీ: కేంద్రమంత్రివర్గంలో చేరుతామని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఒకటి రెండు రోజుల్లో కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి బెర్త్ల పైన చర్చించనున్నారు. టిడిపికి రెండు కేబినెట్ పోస్టులు, మూడు ఎంవోయులు పోస్టులు ఇచ్చే అవకాశముంది.
టిడిపి నుండి ఆరుగురు రాజ్యసభ సభ్యులు, 16 మంది లోకసభ సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రివర్గంలో తమ పార్టీ తరఫున ఉండే వారికి పైన చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ప్రాంతాలు, సామాజిక వర్గాలు తదితరాల ఆధారంగా ఆయన తమకు కేటాయించిన బెర్త్లను ఖరారు చేయనున్నారు. 22 మంది ఎంపీల్లో ఐదుగురికి అవకాశం దక్కనుంది.
ఇందులో టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఉన్నారు. అతను తొలిసారి లోకసభకు ఎన్నికయ్యారు. అయితే అతను ప్రజాప్రతినిధిగా చాలా సీనియర్. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పలుమార్లు గెలుపొంది, రాష్ట్రంలో కీలక మంత్రి పదవులు చేపట్టారు. ఈసారి ఆయన విజయనగరం లోకసభకు పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయన పేరు లిస్టులో ఉండే అవకాశముంది.
శివప్రసాద్ (చిత్తూరు, ఎస్సీ), కిష్టప్ప (అనంతపురం, బిసి) కె రామ్మహన్ నాయుడు (శ్రీకాకుళం, బిసి), మాగంటి బాబు (ఏలూరు, కాపు), రాయపాటి సాంబశివ రావు (గుంటూరు, కమ్మ), కొనకళ్ల నారాయణ (మచిలీపట్నం, బిసి)లు బరిలో ఉన్నారు. రామ్మోహన్ నాయుడు తొలిసారి ఎన్నికైనందున అవకాశం తక్కువ. ఎంపీలుగా ఎన్నికైన వారిలో ఇద్దరు కాపు, ఒకరు రెడ్డి సామాజిక వర్గం వారు ఉన్నారు.
తాను గెలిస్తే కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు ప్రచారం సమయంలో చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే... కేంద్రంలో మంత్రి పదవికి ఆ సామాజిక వర్గానికి దక్కే అవకాశాలు తక్కువ. ఆరుసార్లు ఎంపీగా అనుభవమున్న రాయపాటి మంత్రిపదవిపై ఆశలతో ఉన్నారు.
సీమాంధ్ర నుండి... అశోక గజపతి రాజు, శివప్రసాద్, కిష్టప్ప, రామ్మోహన్ నాయుడు, మాగంటి బాబు, రాయపాటి సాంబశివ రావు, కొణకళ్ల నారాయణ, తెలంగాణ నుండి... దేవేందర్ గౌడ్, గుండు సుధారాణి, గరికపాటి రామ్మోహన రావు, మల్లారెడ్డిలు రేసులో ఉన్నారు. కాగా, బిజెపి నుండి కంభంపాటి హరిబాబు (సీమాంధ్ర), బండారు దత్తాత్రేయ (తెలంగాణ)లు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు.