దుబారా రూ.100కోట్లు, ఇదేం లెక్క బాబు!, జాతీయ మీడియానే నివ్వెరపోతోంది!
నిజానికి వ్యక్తిగత ఖర్చుల విషయంలో ఇంకా చాలా అంశాలు ఉన్నప్పటికీ.. అవేవి బయటపడకుండా సీక్రెట్ క్లాస్ లో ఆ జీవోలను చేర్చినట్లు జాతీయ మీడియా తెలిపింది.
హైదరాబాద్: హైటెక్ సీఎం అని తనకు తాను మురిసిపోయే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఆయనేం చేసినా.. ప్రపంచాన్ని తలదన్నే రీతిలో ఉండాలని కలలు కంటారు. కలలు కనడం వరకు బాగానే ఉంది గానీ, ఆ కలలకు మన బడ్జెట్కు పొంతన కుదరనప్పుడే అసలు చిక్కు!,
అందునా ఓవైపు రాష్ట్ర ఖజానా పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నవేళ.. వ్యక్తిగత ఖర్చుల విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తోన్న తీరు తీవ్ర వివాదస్పదమవుతోంది. ఒక రాష్ట్రానికి సీఎం అయిన వ్యక్తి దేశ ప్రధానిని మించిపోయే తరహాలో విదేశీ ప్రయాణాలు చేయడం.. అద్దె విమానాల కోసం కోట్లు కుమ్మరించడం.. ఏపీ ప్రజానీకాన్ని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
ఆ ఛాన్స్ లేదు:
అసలే రాష్ట్ర విభజనతో తీసికట్టుగా మారిన ఖజానాను చంద్రబాబు తన విలాసాలకు మరింత దుబారా చేయడం ఆలోచించాల్సిన విషయం. ఏ లోకల్ మీడియానో ఈ లెక్కలను బయటపెడితే.. ఇదంతా 'జగన్' కుట్ర అని ఎప్పటిలాగే చంద్రబాబు తప్పించుకోవచ్చు గానీ జాతీయ మీడియా సైతం ఆయన గారి చర్యలకు నివ్వెరపోతుందంటే.. చంద్రబాబు లగ్జరీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒక్క సంవత్సరానికే రూ.100కోట్లు:
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క 2015లొనే రూ.100కోట్లు ఆయన వ్యక్తిగత ఖర్చుల కోసం వినియోగించినట్లు జాతీయ మీడియా ఆధారాలతో సహా బయటపెట్టింది. విదేశీ పర్యటనలు, క్యాంపు ఆఫీసుల మార్పు, వాస్తు విషయంలో దుబారా ఖర్చులు, ఇవన్ని కలగలిపి రూ.100కోట్ల దుబారా ఖర్చులను జాతీయ మీడియా లెక్క తేల్చింది.
ఎందుకు సీక్రెట్ క్లాస్లో జీవోలు?
నిజానికి వ్యక్తిగత ఖర్చుల విషయంలో ఇంకా చాలా అంశాలు ఉన్నప్పటికీ.. అవేవి బయటపడకుండా సీక్రెట్ క్లాస్ లో ఆ జీవోలను చేర్చినట్లు జాతీయ మీడియా తెలిపింది. ఒక్క విజయవాడలోని క్యాంపు ఆఫీస్ కొరకే రూ.21.3కోట్లను బాబు సర్కార్ ఖర్చు పెట్టినట్లు వెల్లడించింది. దీని నిర్వహణ కోసం ప్రతీ నెలా మరో రూ.2లక్షలు. ఇక చంద్రబాబు ఎప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లినా అద్దె విమానాలనే ఉపయోగించుకుంటున్నారు కాబట్టి, చార్టర్ ఫ్లైట్ కోసం రూ.15కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.
ఆ సౌకర్యం ఉన్నా!..
నిజానికి హైదరాబాద్ నుంచి ఆయా దేశాలకు విమాన సౌకర్యాలు ఉన్నప్పటికీ లక్షలు, కోట్ల రూపాయల్లో అద్దెలు చెల్లించి మరీ చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడమేంటని జాతీయ మీడియా మండిపడింది. వ్యక్తిగత ఖర్చులకు సంబంధించి సీక్రెట్ క్లాస్ లో జీవోలను చేర్చడాన్ని తప్పుపట్టింది. లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ కోసం ఖర్చు చేసిన రూ.45కోట్ల గురించి కూడా ప్రశ్నించింది.
బాబుపై విమర్శలు:
ఆపదలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకుంటాడని ప్రజలంతా ఆయనపై నమ్మకం పెట్టుకుంటే.. వ్యక్తిగత ఖర్చుల విషయంలో ఎక్కడా తగ్గకుండా.. 'ఆవిధంగా ఆయన ముందుకెళ్తున్నారని' చంద్రబాబు మార్క్ డైలాగ్ తోనే ఇప్పుడాయనపై సెటైర్లు వేస్తున్నారు జనం. జాతీయ స్థాయిలో చంద్రబాబు లగ్జరీపై ఇంతలా విమర్శలు వెల్లువెత్తుతుంటే.. ఇకనైనా ఆయన తీరులో మార్పు వస్తుందంటారా!, వేచి చూడాల్సిందే.