రేప్ విక్టిం బిడ్డకు నిందితుడి ఆస్తిపై హక్కు: కోర్టు
లక్నో: అత్యాచార ఘటనల్లో మహిళకు కలిగే సంతానానికి... అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తి ఆస్తుల పైన సర్వ హక్కులు ఉంటాయని అలహాబాద్ హైకోర్టు బుధవారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది. అదే సమయంలో పుట్టిన బిడ్డను ఎవరికైనా దత్తతకు ఇస్తే మాత్రం ఆ తండ్రి ఆస్తిపై బిడ్డకు హక్కులు సంక్రమించవని స్పష్టం చేసింది.
తీర్పు సందర్భంగా అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం కారణంగా పుట్టిన బిడ్డకు.. నిందితుడి ఆస్తిపై వారసత్వ హక్కులు ఉంటాయంది. ఇలాంటి సంక్లిష్ట సామాజిక సమస్యను పరిష్కరించేందుకు తగిన చట్టాన్ని తీసుకురావాలని శాసన వ్యవస్థకు సూచించింది.

సదరు చిన్నారిని అత్యాచారానికి పాల్పడిన నిందితుడి అక్రమ సంతానంగా పరిగణించాలనీ, అతడి ఆస్తిపై వారసత్వ హక్కులు ఉంటాయని జస్టిస్ షబీహుల్ హుస్నేయిన్, జస్టిస్ డీకే ఉపాధ్యాయలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ అలాంటి బిడ్డను దత్తతకు ఇస్తే, రక్తం పంచిన తండ్రి ఆస్తిపై హక్కులు ఉండవంది.
అత్యాచార బాధితురాలికి జన్మించిన శిశువు పరస్పర సమ్మతితో కూడిన లైంగిక చర్యతో పుట్టారా లేదా అనేది అసందర్భమని వ్యాఖ్యానించింది.
నవజాత శిశువుకు వారసత్వ హక్కుల్ని వ్యక్తిగత చట్టం అందజేస్తుందనీ, అందుకని రక్తం పంచిన తండ్రి అక్రమ సంతానంగా పరిగణించాలని తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో అత్యాచారానికి గురైన పేద కుటుంబానికి చెందిన ఓ బాలిక గర్భం దాల్చడంతో, ఇటీవల ఓ పాపకు జన్మను ఇచ్చింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ పైన కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.












Click it and Unblock the Notifications