సోనియా డైలమా: సిఎం మార్పా, రాష్ట్రపతి పాలనా?
న్యూఢిల్లీ: తిరుగుబాటు ప్రకటించడానికి సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని తేవాలా? రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధించాలా? అనే విషయంపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ డైలమాలో పడినట్లు చెబుతున్నారు. కిరణ్కుమార్ను తొలగించి ఆయన స్థానంలో కొత్త నేతను ముఖ్యమంత్రిగా నియమించటం ప్రస్తుత వాతావరణంలో అంత సులభం కాకపోవచ్చునని అంటున్నారు. కిరణ్ స్థానంలో నియమించేందుకు ఒకరిద్దరు నేతల పేర్లు పరిశీలనకు వచ్చినా, సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి కొత్త నేతను ఎన్నుకునేందుకు జరిగే ప్రయత్నం బెడిసికొట్టే ప్రమాదం లేకపోలేదని కాంగ్రెసు అధిష్టానం అనుకుంటోంది.
ఈ స్థితిలో ముఖ్యమంత్రిని మార్చడానికి బదులు రాష్ట్రపతి పాలన విధిస్తేనే మేలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన నోట్ను కేంద్ర మంత్రివర్గంలో ఆమోదించిన అనంతరం రాష్టప్రతి ప్రణబ్ముఖర్జీ ద్వారా శాసన సభకు పంపినపుడు ఎదురయ్యే పరిస్థితుల ఆధారంగా రాష్టప్రతి పాలన విధించవచ్చునని అంటున్నారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన నోట్పై చర్చ జరిగే సమయంలో రాష్ట్ర శాసన సభ సజావుగా జరుగుతుందా అనేది కూడా అనుమానమే. శాసనసభలో ఒకవైపు సీమాంధ్రులు మరోవైపు తెలంగాణవాదులు మోహరిస్తే యుద్ధవాతావరణం చోటు చేసుకునే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. దానికి సిద్ధపడి రాష్ట్రం భగ్గుమన్న మరుక్షణం రాష్టప్రతి పాలన విధించటం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణ నోట్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన రోజే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణిస్తుందని కేంద్ర హోం శాఖ అంచనా వేసినట్టు తెలిసింది. ఈ తరుణంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చునని అంటున్నారు.
కేంద్ర మంత్రివర్గం అక్టోబర్ 2న సమావేశమై నేర చరితుల ఆర్డినెన్స్పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ వ్యక్తం చేసిన అసమ్మతిని చర్చించనున్నారు. యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం నేర చరితుల ఆర్డినెన్స్ను ఉపసంహరిచుకోనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రివర్గం ఆర్డినెన్స్పై చర్చించి నిర్ణయం తీసుకున్న అనంతరం, తెలంగాణ నోట్పై చర్చ జరుపుతుందా? లేదా? అనేది ఇంకా స్పష్టం కాలేదు.
కేంద్ర మంత్రివర్గం తెలంగాణ నోట్పై ఇప్పుడు చర్చించకుంటే, ఆ తరువాత జరిగే సమావేశంలో తప్పకుండా పరిశీలిస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ నోట్పై అక్టోబర్ మొదటివారంలో కేంద్ర మంత్రివర్గం చర్చించే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ గతవారం చెప్పటం తెలిసిందే. మొత్తం మీద, తెలంగాణ అంశాన్ని తీరాలకు ఎలా చేర్చాలనే విషయంపై కాంగ్రెసు అధిష్టానం పెద్ద కసరత్తే చేస్తోంది.