హీరోల ఫ్లెక్సీల వివాదం: మహేష్ బాబు వర్సెస్ పవన్ కల్యాణ్
తెలుగు సినీ హీరో మహేష్ బాబు ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. ఫ్లెక్సీల ఏర్పాటుపై రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది
Recommended Video
కాకినాడ: తెలుగు సినీ హీరో మహేష్ బాబు ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. ఫ్లెక్సీల ఏర్పాటుపై రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. బహిరంగ ప్రదేశంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు.
తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోనలోని సుబ్రహ్మణ్యస్వామి గుడి ఎదుట ఏర్పాటుచేసిన చవితి మండపం ఎదుట సినీనటుడు మహేష్బాబు, రాజకీయ నాయకులకు చెందిన రెండు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గతంలో కాట్రేనికోనలో ఫ్లెక్సీల ఏర్పాటుపై ఘర్షణలు జరిగాయి.
మళ్లీ ఘర్షణలు చెలరేగకుండా ఫ్లెక్సీలు తొలగించాలని స్థానికులు పోలీసుల దృష్టికి తెచ్చారు. వెంటనే పోలీసులు, పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా గతనెల చివరివారంలో ఫ్లెక్సీలను తొలగించారు.
అయితే, ఇలా జరిగింది..
సోమవారం వినాయక మండపం వద్ద అన్నసమారాధన జరిగింది. ముందురోజు రాత్రి పంచాయతీ ఆవరణలో ఉన్న మహేష్బాబు, రాజకీయ నాయకులకు చెందిన రెండు ఫ్లెక్సీలను కొందరు గతంలో పోలీసులు తొలగించారు. అయితే ఫ్లెక్సీలను అదే ప్రదేశంలో మళ్లీ పెట్టారు. అన్నసమారాధన చేసిన ప్రదేశం ఎదుట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ స్థానికులు పోలీసుల దృష్టికి తెచ్చారు.
సామాజిక వర్గాల మధ్య ఘర్షణ
పోలీసులు వెంటనే పంచాయతీ సిబ్బంది ద్వారా ఫ్లెక్సీలను తీసేయించారు. దీంతో రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. బీమాల సూరినాయుడు, వంగా దుర్గబాబు, యేడిద ఫణి, పిల్లా నాగుల స్వగృహాలపై పవన్కల్యాణ్ ఫ్లెక్సీలు తొలగించాలని మరో సామాజికవర్గం పోలీసులను నిలదీశారు. పోలీసులు పంచాయతీ సిబ్బంది ద్వారా పవన్కల్యాణ్ ఫ్లెక్సీలు తొలగించడానికి సిద్ధపడ్డారు. దీంతో ఆ సామాజికవర్గానికి చెందినవారు పోలీసులను అడ్డుకున్నారు.
పై అధికారుల దృష్టికి...
వివాదాన్ని ఏఎస్ఐ విత్తనాల నాగేశ్వరరావు పై అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. బహిరంగ ప్రదేశంలో ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని, స్వగృహంపై ఉన్న ఫ్లెక్సీలను తొలగించరాదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నట్టు తెలిపారు. దీంతో వివాదంపై స్పష్టత వచ్చింది.
పన్ను కట్టాలని...
స్వగృహాలపై ఉన్న ఫ్లెక్సీలపై ఆయా ఇళ్ల యజమానులు పంచాయతీ కార్యాలయానికి చలానా రూపంలో ప్రకటనల పన్ను కట్టించాలని ఆదేశించారు. ఈ విషయాన్ని రెండు సామాజికవర్గాలకు ఏఎస్ఐ నాగేశ్వరరావు తెలపడంతో వివాదం సద్దుమణిగింది. ఏ విధమైన కేసులు నమోదు కాలేదు.