బాబుతో 'టక్కర్': అమరావతిలో స్విస్ 'చాలెంజ్'
హైదరాబాద్:అమరావతిలో స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టే నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కష్టాలు ఎదురయ్యేట్లు కనిపిస్తోంది. ఈ నిర్మాణాలపై ఉన్నతాధికారులు వ్యతిరేకత ప్రదర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఠక్కర్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకు సంబంధించిన ఫైలుపై సంతకం చేయడానికి ఠక్కర్ నిరాకరించినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ విధానంలో ప్రభుత్వ పెద్దలు-సింగపూర్ ప్రైవేటు కంపెనీల పేరుతో బినామీల అవతారమెత్తి పొందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్విస్ ఛాలెంజ్ విధానంపై విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, దానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఠక్కర్ నిరాకరించినట్లు తెలుస్తోంది.
మంగళవారం ఆ అంశంపై జరిగిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. స్విస్ చాలెంజ్ విధానాన్ని ఆమోదిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే సంతకం చేశారు, మళ్లీ తాను చేయడం సరైంది కాదని, అది సర్వీసు నిబంధనలకూ వ్యతిరేకమని ఠక్కర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

తాను ఆ విషయంపై అడ్వకేట్ జనరల్ సలహా కోరగా, నిబంధనలను అనుసరించి నిర్ణయం తీసుకోవాలని సూచించారని, ఆ మేరకు స్విస్ చాలెంజ్ విధానంపై మంత్రివర్గమే ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతూ లేఖ రాసినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. నిజానికి, స్విస్ విధానంపై ఏఐఎస్ వర్గాల్లో చాలాకాలం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతోంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఐఏఎస్ అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. స్విస్ చాలెంజ్ విధానం వల్ల ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు సింగపూర్ కంపెనీలతో కుమ్మక్కయి, అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
స్విస్ చాలెంజ్ విధానంలో సొంత డబ్బుతో రాజధానిని నిర్మించే సంస్థ, తాను పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకునేందుకు, టోల్, ఫీజులు, ఇతరత్రా అన్ని ఆదాయమార్గాలు ఎంచుకుంటుంది. వాటికి ప్రభుత్వం అనుమతిస్తుంది. నిబంధనల మేరకు స్విస్ చాలెంజ్ విధానం మంచిదికాదని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కూడా నివేదిక సమర్పించారు. దేశంలో ఎక్కడా ఈ విధానానికి అనుమతి ఇవ్వకూడదని సూచించింది.
సింగపూర్కు చెందిన ఎంటర్ప్రైజస్ లిమిటెడ్తో మాస్టర్డెవలపర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడికి సవాల్గా మారింది.












Click it and Unblock the Notifications