కేవీపీతో బీజేపీ ఒంటరి: మోడీని వెనుకేసుకొచ్చినా..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా బిల్లు పైన గురువారం నాడు రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో బీజేపీ ఓ విధంగా ఒంటరి అయిందని చెప్పవచ్చు. చర్చలో పాల్గొన్న అన్ని పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరాయి.
దీంతో, బీజేపీ ఏకాకిగా మారింది. అన్ని రాష్ట్రాలకు చెందిన పలు పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్నాయి. టిడిపి నేతలు మాత్రం బీజేపీని వెనుకేసుకొస్తూనే, ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. ఇతర పార్టీలు కేంద్రాన్ని నిందించాయి. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి.
కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్ర రావు, గులాం నబీ ఆజాద్, రేణుకా చౌదరి, సుబ్బిరామి రెడ్డి, దిగ్విజయ్ సింగ్, సిపిఐ నేత రాజా, సీతారాం ఏచూరీ, బిజూ జనతా దళ్, బీఎస్పీ, జేడీయూ, టిడిపి నేత సీఎం రమేష్.. ఇలా అందరూ హోదా కావాలని నినదించారు.
జైరాం రమేష్
ఏపీకి హోదాపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ నాటి హామీలను చదివి వినిపించారు. పునర్వ్యవస్ధీకరణ చట్టం సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్ ఏపీకి ఆరు ప్రమాణాలు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలని కోరారని, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలకు అదనపు నిధులు మంజూరు చేయాలన్నారు.
సీఎం రమేష్
విభజనకు ముందు, సుమారు ఆరు నెలలపాటు ఏపీకి అన్యాయం జరుగుతోందని తాము ఆందోళన చేశామని సీఎం రమేష్ అన్నారు. ఆదాయ వనరుల్లో వ్యత్యాసం వస్తోందని, న్యాయం చేయాలని తాము అడిగామన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తేనే బిల్లుకు అంగీకరిస్తామని బీజేపీ చెప్పిందన్నారు. ఆ హామీని నెరవేర్చాలన్నారు. టిడిపి నేత టీజీ వెంకటేష్ కూడా ఇదే విషయం చెప్పారు. వెంకయ్య పదేళ్ల హోదా అని డిమాండ్ చేశారని గుర్తు చేశారు.
విజయ సాయి రెడ్డి
ఐదు కోట్ల మంది ప్రజలకు జరిగిన అన్యాయం పైన తాము మాట్లాడుతున్నామని, న్యాయం చేయాలని వైసిపి ఎంపీ విజయ సాయి రెడ్డి కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ ఎంపీ కేకే కేశవ రావు డిమాండ్ చేశారు. రేణుకా చౌదరి, సుబ్బిరామి రెడ్డి, డి రాజా తదితరులు కూడా డిమాండ్ చేశారు.
బీఎస్పీ
యూపీఏ హయాంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ మేరకు ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీఎస్పీ డిమాండ్ చేసింది. విపక్షంగా ఇప్పటి అధికార పార్టీ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని బీఎస్పీ సూచించింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏపీకి ఏం ఇవ్వాలని నిర్ణయించారో, వాటన్నింటినీ తక్షణం ఇవ్వాలంది. ఏపీకి న్యాయం చేస్తామని కాంగ్రెస్, బీజేపీ రెండు హామీ ఇచ్చాయని సీతారాం ఏచూరి అన్నారు.