సాదత్: అతని దందాలు ఇన్నిన్ని కావయ్యా...

హైదరాబాద్: పాతబస్తీలో స్నేక్ గ్యాంగ్ వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో మొహమ్మద్ సాదత్ అహ్మద్ ఉదంతం అంతే స్థాయిలో సంచలనం సృష్టించింది. మొహ్మద్ సాదత్‌ అహ్మద్ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని దాని ముసుగులో గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. కాపురాలు కూల్చడం, అధికారులను, ప్రజలను బెదిరించడం చేశాడు. సైబరాబాద్‌లో సాదత్‌ పేరు ఇప్పుడు సంచలనానికి కేంద్రమైంది. ఇతడితో పాటు పదిమంది సభ్యులను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు.

సూరారం కాలనీ, సాయిబాబానగర్‌, దుండిగల్‌, సంగారెడ్డి నుంచి అనేకమంది బాధితులు బుధవారం స్టేషన్‌కు వచ్చారు. వారు పోలీసులను అభినందించారు. ప్రస్తుతానికి సాదత్‌ గ్యాంగ్‌పై పోలీసులు ఎనిమిది కేసులు నమోదు చేశారు. త్వరలో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. సాదత్‌ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు కొన్ని కేసులకు సంబంధించి మాత్రమే ఆధారాలను గుర్తించారు. ఇంకా అనేక అక్రమాలు సాదత్‌ ఖాతాలో ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. మీడియాలో అతని వ్యవహారాలపై కథనాలు దండిగా ప్రచురితమయ్యాయి. ఆ కథనాల వివరాలు ఇలా ఉన్నాయి.

Extortions rise in the name of human rights

ఫిర్యాదు, మాఫీ అన్నీ అతడే

పోలీసులకు ఫిర్యాదు చేయించడం, తర్వాత వాటిని మాఫీ చేయించడం అతనికి నేర్చిన విద్య. ఒక్కోపనిని ఒక్కొక్కరికి అప్పగించేవాడు. కొంతమంది అమ్మాయిలను ఉపాధి పేరుతో వివిధ షాపుల్లో పనులకు కుదిర్చేవాడు. ఆ తర్వాత వారితో వ్యాపారులపై పోలీసులకు ఫిర్యాదు చేయించేవాడు. కేసును మాఫీ చేయించడానికి వ్యాపారుల వద్ద భారీగా వసూళ్లు చేసేవాడు. వరకట్న వేధింపుల కేసుల్లోనూ ఇదే తంతు. ఈ విషయాలేమీ తమ దృష్టికి రాలేదని పోలీసులు చెబుతున్నారు. బాధితులు ముందుకు వస్తే తప్పక కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేస్తున్నారు.

స్టేషన్లలో తనకు సంబంధించిన పనులకు ఎటువంటి బ్రేక్‌ పడకుండా ఉండడానికి పలువురు పోలీసులను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. సూరారం కాలనీ, సాయిబాబా నగర్‌లోని భారీ భవంతిలో రాత్రిపూట కొంతమంది పోలీసులకు నెమలి మాంసంతో విందు ఏర్పాటు చేశాడని సమాచారం. ఇటీవల వరకట్న వేధింపులకు సంబంధించి జీడిమెట్లలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ నుంచి లక్ష రూపాయలు తన అనుచరుడి ద్వారా వసూలు చేయించాడు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. ఈ కార్యాలయానికి అనుబంధంగా టోలిచౌకిలో మరో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడని పోలీసులకు సమాచారమందింది. దీనిపై విచారణ చేస్తున్నామని బాలానగర్‌ ఉపకమిషనర్‌ ఏఆర్‌.శ్రీనివాస్‌ చెప్పారు.

సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలిస్తే

సాదత్‌ ఇంట్లో ద్వారం ముందు మెటల్‌ డిటెక్టర్‌తో పాటు ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటి ఫుటేజీలను పరిశీలిస్తే సాదత్‌ భాగోతాలు మరిన్ని బయటకు వస్తాయని బాధితులు చెబుతున్నారు. సాదత్‌ సాగించిన సగానికి పైగా సెటిల్‌మెంట్లు ఇంట్లోనే సాగాయి. బుధవారం ఉదయం ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నప్పుడు చిత్రీకరించడానికి వెళ్లిన మీడియాను లోపలకు వెళ్లనివ్వకుండా ఇద్దరు న్యాయవాదులు అడ్డుకున్నారు. పోలీసులు అరెస్టు చేసినప్పుడు, పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చినప్పుడు తానొక హీరోనన్న భావనతో సాదత్‌ కనిపించాడు.

జీడిమెట్ల, దుండిగల్‌లోని రౌడీషీటర్ల ద్వారా కొంతమంది యువకులను వారానికి ఒకసారి పాతబస్తీకి పంపేవాడని తెలుస్తోంది. ఎందుకోసం వారిని అక్కడకు పంపాడన్న విషయాలు మాత్రం తెలియడం లేదు. దీనిపైనా పోలీసులు దృష్టిసారించాలని చుట్టుపక్కల ప్రజలు కోరుతున్నారు. సాదత్‌ దందాలన్నీ రోడామిస్త్రీ నగర్‌, సుభాష్‌నగర్‌, నెహ్రూనగర్‌, జగద్గిరిగుట్ట, సూరారం కాలనీ, కైసర్‌నగర్‌, ప్రకాశం పంతులు నగర్‌, షాపూర్‌నగర్‌, సాయిబాబానగర్‌, చంద్రగిరినగర్‌లో ఎక్కువగా సాగించాడని పోలీసులు నిర్ధారించారు.

ఇదీ సాదత్‌ చరిత్ర

సంగారెడ్డిలో 1997లో మస్తాన్‌రావు అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లాడు. జైల్లో ఉండగా నక్సలైట్‌ వెంకట్‌తో పరిచయం పెంచుకున్నాడు. జైలునుంచి విడుదలైన తర్వాత వెంకట్‌తో కలిసి జోగిపేట, పటాన్‌చెరు, సంగారెడ్డి, నర్సాపూర్‌ ప్రాంతాల్లో తపంచాలు చూపించి వ్యాపారులను బెదిరించి వసూళ్లు చేశాడు. వీటిపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు జైలుకు పంపారు.

2001లో సంగారెడ్డి నుంచి తన మకాం సూరారంలోని సాయిబాబానగర్‌కు మార్చాడు. ఇంటి పక్కనే ఉంటున్న హుస్సేన్‌ అనే వ్యక్తి ప్లాట్‌ను ఆక్రమించుకోవడానికి యత్నించాడు. దీనిపై కేసు నమోదైంది. సాదత్‌పై దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌లో రెండు, జీడిమెట్ల పోలీసుస్టేషన్‌లో ఏడు కేసులు నమోదయ్యాయి. భవానీనగర్‌లో రహీంఖాన్‌కు చెందిన ప్లాట్‌కు సంబంధించి తన అనుచరులు అబ్దుల్లా, యూసుఫ్‌, షాలి హుస్సేన్‌, కైసర్‌, గౌస్‌, ముజీబ్‌, బట్లు వీరేశ్‌ ద్వారా నోటరీని తయారు చేయించి సరోన్‌ అనే వ్యక్తికి 2 లక్షల 50 వేల రూపాయలకు విక్రయించాడు.

దుండిగల్‌లోని పాండుబస్తీలో రహదారిని కబ్జా చేయడానికి ప్రయత్నించగా దీనికి చెంతనే ఉన్న ఇంటి యజమాని మహ్మద్‌ హుస్సేన్‌ను బెదిరించి 50 వేల రూపాయలు డిమాండ్‌ చేశాడు. తర్వాత 20 వేలు తీసుకున్నాడు. సుఖ్‌దేవ్‌ అనే వ్యక్తి కైసర్‌నగర్‌లో ప్లాట్‌ను కొనుగోలు చేయగా దాన్ని వివాదం చేశాడు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి సుఖ్‌దేవ్‌ను బెదిరించి లక్షా 90 వేల రూపాయలు వసూలు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+