ఎంత పనైపోయింది.. అంతా కన్ఫ్యూజన్?: ఉక్కిరిబిక్కిరవుతున్న బాబు!, జగన్ పైచేయి?
అమరావతి: ఏపీ రాజకీయాల్లో ప్రధాన పార్టీల రాజకీయాలు రాజీనామాల పర్వం చుట్టూ అల్లుకుపోతున్నాయి. తమ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ పాదయాత్రలో జగన్ చేసిన ప్రకటన.. టీడీపీ శిబిరంలో అలజడి రేపినట్టే కనిపిస్తోంది. ప్రజల్లో ఎక్కడ జగన్ పట్ల సానుకూల వైఖరి ఏర్పడుతుందేమోనన్న కలవరం వారిలో మొదలైందేమో!
Recommended Video

ఈ నేపథ్యంలోనే ఏం చేయాలనే విషయంపై పార్టీ సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు.. ఏమి తేల్చకుండానే ముగించేశారా? అన్నది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే.. సమావేశానంతరం మీడియా సమావేశం ఎందుకు పెట్టలేదు.పోనీ తమ పార్టీ నాయకులతోనైనా ఎందుకు ఏమి చెప్పించలేదు.

ఆ లీకుల సంగతేంటి?:
కేంద్రం దిగిరాకపోతే.. వైసీపీ ఇచ్చిన డెడ్ లైన్ కన్నా ముందే తమ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు రాజీనామా చేస్తారని ఆది ప్రకటించారు. అయితే ఈ ప్రకటించడంలో బాబు వ్యూహం దాగుందా?.. లేదా ఇంకెన్నిసార్లు మీడియా అడిగే ప్రశ్నల్ని దాటవేస్తామన్న ధోరణితో.. ఏదో తనకు తోచింది చెప్పేశారా? అన్న దానిపై క్లారిటీ లేదు.

ఇరుకునపడ్డ చంద్రబాబు..:
టీడీపీ పరిస్థితి చూస్తుంటే.. జగన్ సంధించిన రాజీనామా అస్త్రం వారిని తీవ్రంగానే ప్రభావితం చేసినట్టు కనిపిస్తోంది. వైసీపీ ఎంపీలు డెడ్లైన్తో ముందుకు రావడంతో.. టీడీపీ కూడా ఏదో ఒకటి తేల్చుకోక తప్పని పరిస్థితి తలెత్తింది.
ఓవైపు కేంద్రంతో గొడవలు వద్దంటూనే.. సమస్యలు మాత్రం పరిష్కారం కావాలనే చంద్రబాబు ధోరణి.. 'అవ్వా కావాలి బువ్వా కావాలి' అన్న చందంగా తయారవడం ప్రజలకూ అర్థమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావించి ఉంటారేమో!

క్రెడిట్ జగన్ ఖాతాలోకి..:
ఇప్పుడు టీడీపీ రాజీనామాల ప్రకటన చేసినా.. ఆ క్రెడిట్ తమకు దక్కేలా చేసుకునేందుకు వైసీపీ ఉత్సాహం చూపించడంలో ఆశ్చర్యమేమి ఉండదు. తాము రాజీనామాలను ప్రకటిస్తే కానీ చంద్రబాబుకు సోయి రాలేదన్న విమర్శలు ఎక్కుపెడుతుంది. తమ వల్లే టీడీపీలో చలనం వచ్చిందని చెప్పుకుంటుంది. రాజకీయంగా పక్కనపెడితే.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం ఈ పరిణామం మంచికే దారితీసే అవకాశముంది.

అంతా కన్ఫ్యూజన్:
వైసీపీ ప్రకటించిన తర్వాత రాజీనామాలు ప్రకటిస్తే.. క్రెడిట్ ఎక్కడ జగన్కు వెళ్తోందన్న భయం ఒకవైపు.., ఒకవేళ నిజంగానే ప్రకటిస్తే.. ఈ పనేదో ఇన్నాళ్ల నుంచి చేసి ఉంటే బాగుండేది కదా! అన్న విమర్శలు మరోవైపు.. సరే, ఇంతా చేసినా ఏమైనా ప్రయోజనం దక్కుతుందా? లేదా ? అన్న కన్ఫ్యూజన్ ఇంకోవైపు..
మొత్తంగా ఈ ప్రశ్నలన్ని చంద్రబాబును గందరగోళపరుస్తున్నాయనే చెప్పాలి. అందుకే సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏదో ఒకటి తేల్చిపారేయాలనుకున్నా.. చివరాఖరికి ఏది తేల్చక.. అటు నేతలకూ సరైన దిశా నిర్దేశం చేయలేకపోయారన్న విమర్శలు బలంగా వినినపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications