కర్ణాటక,మహరాష్ట్రల మధ్య చిచ్చుపెట్టిన ఎర్రబస్సు, 16 మందిపై రాజద్రోహం కేసు
ఎర్రబస్సు రాజేసిన చిచ్చు రెండు రాష్ట్రాల నడుమ ఉద్రిక్తకు దారితీసింది. జై మహరాష్ట్ర అనే నినాదం రాసి ఉన్న మహరాష్ట్ర ఆర్టీసి బస్సును కర్ణాటక పోలీసులు బెల్గాంలో అడ్డుకొన్నారు.
బెల్గాం: ఎర్రబస్సు రాజేసిన చిచ్చు రెండు రాష్ట్రాల నడుమ ఉద్రిక్తకు దారితీసింది. జై మహరాష్ట్ర అనే నినాదం రాసి ఉన్న మహరాష్ట్ర ఆర్టీసి బస్సును కర్ణాటక పోలీసులు బెల్గాంలో అడ్డుకొన్నారు. కర్ణాటక పోలీసులు మహరాష్ట్ర ఏకీకరణ్ సమితి కార్యకర్తలను అరెస్టుచేశారు.వారిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై శివసేన ఘాటుగా స్పందించింది.కర్ణాలక ప్రభుత్వానిది మతితప్పిన చర్యగా ఆ పార్టీ విమర్శించింది. ఇటు కర్ణాటక మంత్రి రోషన్ బేగ్, కన్నడ గడ్డపై మరాఠా అనుకూల నినాదాలు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని తీవ్ర హెచ్చరికలు చేసింది.
మహరాష్ట్ర సరిహద్దులోని బెల్గాం జిల్లాలో అత్యధికులు మరాఠీనే మాట్లాడుతారు. కర్ణాటకలోని ఈ జిల్లాను విభజించి మహరాష్ట్రలో కలపాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. అయితే ఈ డిమాండ్ కు ప్రజల నుండి పెద్దగా మద్దతు లేదు. కాగా, మహరాష్ట్రలోని బీజేపీ -శివసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వివాదానికి మళ్ళీ జీవం పోశాడు.
ముంబై నుండి బెల్గాంకు వెళ్ళే మహరాష్ట్ర ఆర్టీసీ బస్సులపై జై మహరాష్ట్ర నినాదాలు రాయించారు. ఇది కర్ణాటక ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఇటు బెల్గాం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే మహరాష్ట్ర ఏకీకరణ్ సమితి సంస్థ జై మహరాష్ట్ర బస్సులకు స్వాగతం పలికేందుకు సిద్దమైంది. బస్సు కర్ణాటక భూ భాగంలోకి ప్రవేశించిన వెంటనే పోలీసులు దానిని స్వాధీనం చేసుకొని 16 మందిపై దేశద్రోహం కేసులు నమోదుచేశారు.
బెల్గాం జిల్లాను మహరాష్ట్రలో కలిపేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని శివసేన పార్టీ ప్రతినిధి నీలవ్ గోర్హే డిమాండ్ చేశారు. తమ రాష్ట్రానికి చెందిన బస్సు డ్రైవర్ కండక్టర్లపై దేశ ద్రోహం కేసులు పెట్టడం దారుణమని కర్ణాటకపై మండిపడ్డారు.
వివాదాల నేపథ్యంలో మహరాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తక్షణమే బెల్గాం ప్రాంతంలో పర్యటించాలని శివసేన పార్టీ అధికార పత్రిక సామ్నా కోరింది.
ఏ జిల్లాలోనైనా జై మహరాష్ట్ర నినాదాలు చేసేవారిని ఉపేక్షించోమని కర్ణాటక రాష్ట్రమంత్రి రోషన్ బేగ్ హెచ్చరించారు. ప్రజాప్రతినిదులు కానీ, ప్రభుత్వాధికారులు కానీ నినాదాలు చేసినట్టైతే పదవుల నుండి ఉద్యోగాల నుండి తొలగిస్తామని బేగ్ చెప్పారు.ఈ మేరకు కఠిన చట్టం ఒకటి రూపొందించనున్నట్టు తెలిపారు.