త్వరలో దీప రాజకీయం ప్రవేశం, పెరుగుతున్న మద్దతు: శశకళకు చిక్కులేనా?
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేశారు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రవేశం గురించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని దీపా ప్రకటించారు. తాను రాజకీయ ప్రవేశం చేసే విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
జయ మృతి పట్ల అనుమానం
ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మరో మూడు వారాల తర్వాతే తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. తన అత్త జయలలిత మరణం పట్ల తనకు అనుమానం ఉందన్నారు. ఆమెకు వైద్యశాలలో అందించిన చికిత్స వివరాలను పూర్తి స్థాయిలో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
దీపా వైపు అసంతృప్తి వర్గం
తన గురించి కొన్ని పత్రికలు ఊహాగానాలు ప్రచురిస్తున్నాయని, వాటిని నమ్మరాదని దీపా జయకుమార్ చెప్పారు. కాగా, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీలో అసంతృప్తి వర్గీయులు అనేకమంది దీపా వైపు మొగ్గు చూపారు. ఆమెను రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
దీపకు ఎనలేని ఆనందం
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల నుంచి భారీఎత్తున అసంతృప్తి వర్గీయులు దీపా ఇంటి వద్దకు వచ్చి ఆమెను రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం సేలం, వేలూరు తదితర కొన్ని జిల్లాల నుంచి వచ్చిన వారు ఆమె ఇంటి వద్ద భారీ ఎత్తున మోహరించారు. వారి ఉత్సాహాన్ని చూసి దీపా ఎనలేని ఆనందంలో మునిగిపోయారు.
దీపా
తన ఇంటి పై అంతస్తు నుంచి చేతులూపి వారికి అభివాదం చేశారు. దీపా ప్రసంగించేటప్పుడు జయలలితలాగానే హావభావాలను కనబరచడాన్ని చూసి వారందరూ ఆమెకు మద్దతుగా మరింత పెద్దగా నినాదాలు చేశారు.
శశికళకు చిక్కేనా..
దీపా జయకుమార్ రాజకీయ రంగప్రవేశంతో శశికళకు చిక్కులు తప్పేట్లు లేవు. ఎందుకంటే... శశికళపై అసంతృప్తితో ఉన్న కిందిస్థాయి నేతలు చాలా మంది.. ఇప్పుడు దీపా జయకుమార్కు మద్దతు పలుకుతున్నారు. ఇక దీపా జయకుమార్ రాజకీయ ప్రవేశం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసినట్లయితే ఆమెకు ఊహించని మద్దతు లభించే అవకాశాలు లేకపోలేదు. అంతేగాక, జయలలితను పోలి ఉండటం కూడా దీపకు అదనంగా కలిసివచ్చే అంశం.