బాబు వర్సెస్ కేసీఆర్: 2 తెలుగు రాష్ట్రాల గొడవనా?
హైదరాబాద్/అమరావతి: మొదట... తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అంశం, ఆ తర్వాత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆడియో విడుదల వ్యవహారం.... రెండు తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) మధ్య గొడవగా మారిందా? అనే అంశం చర్చకు వస్తోంది.
ఈ అంశం రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిందని తెలుగుదేశం పార్టీ, ఏపీ ప్రభుత్వం చెబుతుంటే, అలాంటి దానికి తావే లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీలో విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.
చంద్రబాబు ఆడియో రికార్డులు విడుదలైన తర్వాత చంద్రబాబు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం పరకాల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆ గొంతు చంద్రబాబుది కాదని చెప్పారు. తెరాస రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారుస్తోందని మండిపడ్డారు.
అది చంద్రబాబు సంభాషణ కాదని, ముఖ్యమంత్రిని అరెస్టు చేసే దమ్ము, ధైర్యం ఎవరికి లేదన్నారు. ఈ సంభాషణ ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తే తెరాస ప్రభుత్వం చెప్పాలన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ చేశారా లేక ఎక్కడెక్కడి మాటలో కలిపారా అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకుంటున్న మహాసంకల్పం స్ఫూర్తిని దెబ్బతీసేందుకే ఈ పన్నాగం అన్నారు. తెలంగాణలో తెరాస ఏడాది సంబరాలు చేసుకుందని, తాము మాత్రం సంకల్పం చేసుకోవద్దా అని ప్రశ్నించింది.

ఇది ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా మారుస్తున్నారని తెరాసపై పరకాల మండిపడ్డప్పుడు విలేకరులు ఆయనను ప్రశ్నించారు. తెరాస, టీడీపీ మధ్య గొడవను రాష్ట్రాల మధ్య వివాదంగా ఎలా చెబుతారని అడిగారు.
దానికి ఆయన స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన హోంమంత్రి స్వయంగా చంద్రబాబు పైన పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పారని, మంత్రులు కూడా ఆరోపణలు చేస్తున్నారని, ఏపీకి చెందిన చంద్రబాబు పైన తెరాస ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని, అలాంటప్పుడు ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా కనిపించడం లేదా అన్నారు.
అయితే, ఇది రెండు రాష్ట్రాల గొడవ అనడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ, తెరాస వ్యవహారంగానే కనిపిస్తోందని అంటున్నారు. టీడీపీని దెబ్బతీసేందుకు తెరాస వ్యూహాత్మకంగా ముందుకు పోతోందని, అది ఆ రెండు పార్టీల వివాదమే అంటున్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చూడవద్దంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్కు చెందిన సాక్షి పత్రికలో.. యావత్ తెలుగు జాతి టీడీపీని ముద్దాయిగా చూస్తున్నా చంద్రబాబు, టీడీపీ ఇంకా నిజం ఎందుకు చెప్పే ప్రయత్నం చేయడంలేదని ప్రశ్నించింది.
ఎమ్మెల్యేను కొనేందుకు ప్రయత్నిస్తూ టీడీపీ అధినేత దొరికితే ఏపీ ముఖ్యమంత్రి పైన కుట్ర జరిగిందనడమేమిటని, ఏపీ సీఎంకు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏం పని అని ప్రశ్నించింది. ఆ పార్టీ, తమ పార్టీ అధినేత చంద్రబాబు తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చాలని చూస్తున్నారని పేర్కొంది.












Click it and Unblock the Notifications