జగన్ మంచోడే.. కానీ, తెలంగాణ వ్యతిరేకిగా తేల్చిన పొంగులేటి
ఖమ్మం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకిగా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తేల్చేశారు. ఆయన సోమవారం నాడు వైసిపికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా రాజీనామా చేశారు.
ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో వారు తెరాసలో చేరనున్నారు. రాజీనామా సందర్భంగా ఎంపీ, నిన్నటి దాకా తెలంగాణ వైసిపి అధ్యక్షుడిగా ఉన్న పొంగులేటి సంచలన, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ తనను కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారని, తాను రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రాష్ట్ర విభజన జరిగిందని చెప్పారు. కష్టనష్టాలు ఎదురైనా పార్టీతోనే నడిచానని గుర్తు చేశారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించానన్నారు.

అయితే ఏపీ ప్రజల శ్రేయస్సుకోసం జగన్ తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై దీక్షకు దిగేందుకు నిర్ణయించుకున్నారని, దీంతో తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు.
పలువురు నేతలు పార్టీ మారిన సందర్భంగా జగన్, పార్టీపై తీవ్ర విమర్శలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారిలా ఇతరులను కించపరిచే మనస్థత్వం జగన్ది కాదన్నారు. జగన్ దీక్ష చేస్తానని ప్రకటించడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అదనంగా ఒక్క క్యూసెక్కు నీటిని కూడా వినియోగించుకోవడం లేదన్నారు. అలాంటప్పుడు జగన్ దీక్షలో పస లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల కోసమే ఈ నెల 4న సాయంత్రం మూడు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు.
తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరగవద్దనే తాను వైసిపికి రాజీనామా చేశానని చెప్పారు. కాగా, తన వ్యాఖ్యల ద్వారా పొంగులేటి... వైయస్ జగన్ తెలంగాణకు వ్యతిరేకి అని చెప్పారని అంటున్నారు. టిఆర్ఎస్ నేతలు, మంత్రులు కూడా జగన్, చంద్రబాబుల పైన ప్రాజెక్టుల విషయమై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications