మహమ్మారి సోకిందేమే: కన్నయ్య బెయిల్ టైంలో జడ్జి ఘాటుగా..
న్యూఢిల్లీ: కన్నయ్య కుమార్కు బుధవారం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన సమయంలో ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభారాణి మాట్లాడుతూ... విశ్వవిద్యాలయంలో శాంతి చెదిరిపోవడానికి బాధ్యులు ఎవరో చెప్పాలని విద్యార్థులు, టీచర్లను ఉద్దేశించి ప్రశ్నించారు.
ఉపకార్ చిత్రంలోని రంగ్ హరాహారీ... అనే దేశభక్తి గీత చరణాలను న్యాయవాది ప్రస్తావించారు. ఈ గీతంలో పేర్కొన్నట్లు ఇలాంటి కాలంలో జెఎన్యులో శాంతివర్ణం ఎందుకు పరుచుకోలేదని ప్రశ్నించారు. జడ్జి ఇంకా మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే ఇది జాతి వ్యతిరేక నినాదాల కేసు అని, ఈ నినాదాలకు దేశ సమగ్రతను దెబ్బతీసేంత ప్రభావం ఉందని కోర్టు పేర్కొంది.
ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున భావప్రకటనా స్వేచ్ఛ ఆధారంగా తమకు రక్షణ కల్పించాలని నిందితులు కోరడం కుదరదని జడ్జి పేర్కొన్నారు. జాతి వ్యతిరేక కార్యక్రమం అనడానికి ఆస్కారమున్న ఎలాంటి సమావేశాల్లోనూ కన్నయ్య కుమార్ పాల్గొనకూడదని ఆదేశించింది.
కుమార్ తల్లి అంగన్వాడీలో పని చేస్తారని, ఆమెకు వచ్చే జీతం రూ.3 వేలతోనే కుటుంబం గడుస్తుంది కాబట్టి, దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నామని జడ్జి అన్నారు. కుమార్ రూ.10 వేల వ్యక్తిగత బాండ్ సమర్పిస్తే సరిపోతుందన్నారు. అయితే జేఎన్యూ బోధనా సిబ్బంది ఒకరు అతడికి పూచీకత్తు ఇవ్వాలన్నారు.
ఫిబ్రవరి 9న జేఎన్యూలో జరిగిన ఓ కార్యక్రమంలో కొందరు విద్యార్థులు జాతి వ్యతిరేక నినాదాలు చేశారని, ఇలాంటి వాటిని కోర్టు తీవ్రంగా పరిగణిస్తుందని జడ్జి అన్నారు. ఎవరైనా ఎలాంటి రాజకీయ సిద్ధాంతాలనైనా అనుసరించే స్వేచ్ఛ వారికి ఉంటుంది కానీ ఇవి రాజ్యాంగానికి లోబడి ఉండాలన్నారు.
జెఎన్యూ విద్యార్థుల నినాదాలను పరిశీలిస్తే వారికి ఏదో మహమ్మారి సోకినట్లు తెలుస్తోందని, ఇది సాధారణ మందులకు లొంగకుంటే శస్త్రచికిత్స చేయడమే పరిష్కారమని, ఇది మానసిక జాఢ్యం అని జడ్జి అన్నారు. శరీరంలో ఏ అవయవానికైనా ఇన్ఫెక్షన్ సోకితే తొలుత యాంటీబయాటిక్స్ ఇస్తారని, వీటికీ లొంగకుండా అవయమంతా ఇన్ఫెక్షన్ సోకి కుళ్లిన పుండులా తయారైతే అవయవాన్ని తీసేయక తప్పదని కోర్టు పేర్కొంది.