'విత్ డ్రాపై ఆంక్షలు ఎందుకు, ఏటీఎంలు ఆ తర్వాత పని చేస్తాయా?'
అసలు నగదు విత్ డ్రా పైన ఆంక్షలు ఎందుకు అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం నాడు ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: అసలు నగదు విత్ డ్రా పైన ఆంక్షలు ఎందుకు అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం నాడు ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఇచ్చిన 50 రోజుల గడువు ముగిసిందని, ఇంకా విత్ డ్రా పైన ఆంక్షలు ఎందుకన్నారు.
ప్రజలు కష్టపడి సంపాదించుకున్న నగదును తీసి వాడుకునే వారి హక్కులను ఎందుకు హరిస్తున్నారని నిలదీశారు. ప్రజల ఆర్థిక హక్కును వారి నుంచి తీసుకోలేరన్నారు.
జనవరి 1 నుంచి ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా పరిమితిని రూ.4500కి పెంచారు. కానీ వారానికి రూ.24వేలు విత్ డ్రా పరిమితిని మాత్రం పెంచలేదు. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దును మమతా మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు.

చిదంబరం సూటి ప్రశ్న
నోట్ల కొరతతో ప్రజలు కొద్దిరోజులు ఇబ్బందులు పడ్డారని, నిర్ణయం ప్రకటించి 50 రోజులు గడిచినా ఇంకా బ్యాంకుల్లో నగదు లావాదేవీలపై విధించిన ఆంక్షలు ఎత్తివేయకపోవడంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్నేత చిదంబరం ట్విట్టర్లో పలు ప్రశ్నలు సంధించారు.
డిసెంబర్ 30 వరకు ప్రజలను ఓర్పుగా ఉండాలని కోరారని, కానీ మీరు ఇచ్చిన 50 రోజులు పూర్తయినప్పటికీ బ్యాంకుల్లో నగదు ఉపసంహరణకు సంబంధించిన నిబంధనల్ని ఎందుకు సడలించడం లేదన్నారు. జనవరి 2నుంచి దేశంలోని అన్ని ఏటీఎంలూ తగినంత మొత్తం నగదుతో సక్రమంగా పని చేస్తాయా? ఒకవేళ చేయకపోతే ఎందుకో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications