మెట్రో రైలు స్పీడ్: ఆ చిక్కులు తొలిగాయి (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాదులోని మెట్రో రైలు పనులు మరో అడుగు ముందుకు వేశాయి. ఉగాది నాటికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు మెట్రో రైలు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పనుల్లో అతి ముఖ్యమైన ఆర్వోబి పనులకు ఇంతకాలం ఎదురైన అడ్డంకులు కొద్దిరోజుల క్రితం నగరానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి రావటంతో తొలగిపోయాయి.
రైల్వే లైన్లున్న ప్రాంతాల్లో మెట్రో కారిడార్ కోసం నిర్మించనున్న రోడోవర్ బ్రిడ్జిలకు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైలు కోట్లలో దక్షిణ మధ్య రైల్వేకు ఛార్జీలను చెల్లించాల్సి ఉండేది. కానీ ఈ ఛార్జీలను మాఫీ చేయించుకునేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రిని ఓప్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలం కావటంతో ఆర్వోబిల నిర్మాణానికి ఎదురైన ఇబ్బందులు తొలగిపోయాయి.
దీంతో ఎట్టకేలకు భరత్నగర్ ఆర్వోబి పనులను బుధవారం అధికారులు ప్రారంభించారు. ఈ వంతెన పనులను గిర్డర్ పద్దతిలో చేపట్టనున్నట్లు తెలిపారు. మున్ముందు ఈ వంతెనను విస్తరించుకునే ముందుచూపుతో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మెట్రో రైలు
మూడు కారిడార్లుగా నగర ప్రజలకు అందుబాటులోకి రానున్న మెట్రోరైలు మార్గాల్లో హైదరాబాద్ మెట్రో రైలు తరపున దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివిధ ప్రాంతాల్లో ఎనిమిది ఆర్వోబిలను నిర్మించాల్సి ఉంది.
మెట్రో రైలు
వీటిలో మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు నిర్మించనున్న కారిడార్ 1లోని భరత్నగర్, లక్డీకాపూల్, మలక్పేట, అలాగే సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఏర్పాటు చేయనున్న కారిడార్ 2లో బోయిగూడ, నాగోల్ నుంచి శిల్పారామం వరకు అందుబాటులోకి రానున్న కారిడార్ 3లోని బేగంపేట, సికిందరాబాద్ ఓలిఫెంటా, చిలకలగూడ, ఆలుగడ్డబావి ప్రాంతాల్లో ఈ ఆర్వోబిలు నిర్మించనున్నారు.
మెట్రో రైలు
ఈ ప్రాంతాల్లోని రైల్వే లైన్లను అధిగమించేందుకు, ప్రస్తుతమున్న రైల్వే లైన్ పైన వంతెనలు అందుబాటులోకి రానున్నాయి.
మెట్రో రైలు
వీటిలో భరత్నగర్, ఆలుగడ్డబావి, చిలకలగూడ ప్రాంతాల్లో గిర్డర్ విధానంతో కాంక్రీట్ వంతెనలు నిర్మించేందుకు, అలాగే లక్డీకాపూల్, మలక్పేట, బేగంపేటల్లో బ్రిడ్జి బిల్డర్ పద్దతిలో నిర్మాణాలు చేపట్టనున్నారు.
మెట్రో రైలు
మిగిలిన సికిందరాబాద్ ఓలిఫెంటా, బోయిగూడల్లో సరికొత్త విధానంతో స్టీల్ బ్రిడ్జిలను నిర్మించే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
మెట్రో రైలు
భరత్ నగర్లో భూమి ఉపరితలం నుంచి 46 అడుగుల ఎత్తులో, లక్డీకాపూల్, మలక్పేటల్లో 35 అడుగుల ఎత్తున ఈ వంతెనలను నిర్మించనున్నారు.
మెట్రో రైలు
వీటితో పాటు బేగంపేట, ఆలుగడ్డబావి ప్రాంతాల్లో 62 అడుగుల ఎత్తున, చిలకలగూడలో 74 అడుగుల ఎత్తున, సికిందరాబాద్ ఓలిఫెంటా బ్రిడ్జి వద్ద 58 అడుగులు, అలాగే బోయిగూడ వద్ద 51 అడుగుల ఎత్తున ఈ వంతెనలను నిర్మించనున్నట్లు మెట్రోరైలు అధికారులు తెలిపారు.