టీ సాకుగా మోడీపై అద్వానీ: సరిచేసిన రాజ్నాథ్
న్యూఢిల్లీ: ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఆగ్రహంతోనే బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే మాట వినిపిస్తోంది. తెలంగాణపై పార్టీ వైఖరి వల్ల, మోడీపై ఉన్న వ్యక్తిగత ప్రతిష్ట వల్ల ఇటు తెలంగాణలోనూ అటు సీమాంధ్రలోనూ బిజెపికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ మాత్రం సీట్లు లభించినా అది మోడీ అధికారం చేపట్టడానికి వీలవుతుంది. నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న అద్వానీ రంగంలోకి దిగి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే మాట వినిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మాటలు కూడా అద్వానీపై ఎక్కువగా పనిచేసినట్లు భావిస్తున్నారు. లోకసభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ అద్వానీని బలవరుస్తూ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా చూడాలనే ఎత్తగడ వేసినట్లు భావిస్తున్నారు. ఆ కారణంగానే సుష్మా స్వరాజ్ కాంగ్రెసు వైఖరిని తప్పు పడుతున్నట్లు తెలుస్తోంది.

మోడీపై ఉన్న వ్యతిరేకత కారణంగానే అద్వానీ తెలంగాణ అంశాన్ని వాడుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టలేదని సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలతో బిజెపి తెలంగాణ నేతలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కేంద్ర మాజీ మంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావుతో పాటు శాసనసభ్యులు జి. కిషన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస రెడ్డి, పార్టీ నేతలు రాజ్నాథ్ సింగ్ నివాసానికి వెళ్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసాగరరావు కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ బిల్లుపై వెనక్కి తగ్గితే రాష్ట్రంలో పార్టీ పూర్తిగా నష్టపోతుందనే ఆవేదనను వారు వ్యక్తం చేయడంతో రాజ్నాథ్ సింగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణపై స్పష్టత ఇచ్చారు. అద్వానీ, సుష్మా స్వరాజ్ ప్రకటనల వల్ల జరిగే నష్టాన్ని ఊహించి, పార్టీ అధ్యక్షుడిగా చెబుతున్నా, మా పార్టీ తెలంగాణ బిల్లుకు మద్దతిస్తుంది అని కచ్చితమైన ప్రకటన చేశారని అంటున్నారు.
తెలంగాణ అంశాన్ని సాకుగా తీసుకుని నరేంద్ర మోడీ వ్యతిరేక లాబీని తనవైపు కూడగట్టుకునే ప్రయత్నాలకు అద్వానీ ఒడిగట్టారనే అనుమానాలు తలెత్తాయి. తెలంగాణ పార్టీ నాయకుల ఆవేదనతో పాటు జరగబోయే నష్టంపై అంచనాకు రావడమే రాజ్నాథ్ సింగ్ ఆ ప్రకటన చేయాల్సి వచ్చిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications