యూఏఈ టాప్: అమెరికాలో కంటే పాక్లోనే మనోళ్లు ఎక్కువ
ప్యూ రీసెర్చ్ ప్రకారం.. అమెరికాలో కంటే పాకిస్తాన్లోనే ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ), పాకిస్తాన్, అమెరికాలలో ఎక్కువ మంది భారతీయులు నివసిస్తున్నారు.
న్యూఢిల్లీ: ప్యూ రీసెర్చ్ ప్రకారం.. అమెరికాలో కంటే పాకిస్తాన్లోనే ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ), పాకిస్తాన్, అమెరికాలలో ఎక్కువ మంది భారతీయులు నివసిస్తున్నారు.
2015లో ఎక్కువ మంది ఇండియన్ మైగ్రాంట్స్ ఉన్న వారిలో పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంది. యూఏఈ మొదటి స్థానంలో ఉంది.
యూఏఈ టాప్, పాక్ రెండో స్థానంలో
యూఏఈలో 3.5 మిలియన్ ఇండియన్స్ ఉన్నారు. గత రెండు దశాబ్దాలుగా భారతీయులు లేబర్ ఉద్యోగం కోసం అక్కడకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు.
ఆ తర్వాత పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ రెండు మిలియన్ల ఇండియన్ మైగ్రాంట్స్ ఉన్నారు. అలాగే, అమెరికాలోను రెండు మిలియన్లు ఉన్నారు. తొలి స్థానంలో యూఏఈ, రెండో స్థానంలో పాకిస్తాన్, మూడో స్థానంలో అమెరికా ఉంది.
ప్రతి 20 మందిలో భారత్లో జన్మించిన వారు ఒకరు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారుల్లో ప్రతి 20 మందిలో ఒకరు భారత్లో జన్మించినవారేనని తాజా నివేదిక వెల్లడించింది. భారత్లో జన్మించినవారిలో దాదాపు ఒక శాతం మంది మాత్రమే మాతృదేశానికి వెలుపల జీవిస్తున్నారని తెలిపింది.
ఇతర దేశాల్లో జీవిస్తున్నారు
గత ఇరవై అయిదు సంవత్సరాలుగా ఇండియన్ మైగ్రాంట్స్ రెండింతల కంటే ఎక్కువగా పెరిగారు. 2015లో భారత దేశంలో జన్మించిన వారిలో 15.6 మిలియన్ల ప్రజలు ఇతర దేశాల్లో జీవిస్తున్నారు.
భారత్ కూడా వలసదారులకు ఆశ్రయమిస్తోంది
భారీ సంఖ్యలో వలసదారులకు భారత్ ఆశ్రయమిస్తోందనీ నివేదిక సూచించింది. భారత్లో 32 లక్షలమంది బంగ్లాదేశ్వాసులు, 11 లక్షలమంది పాకిస్థానీలు, 5.4 లక్షలమంది నేపాల్వాసులు, 1.6 లక్షలమంది శ్రీలంకవాసులు వలసదారులుగా ఉన్నారని తెలిపింది.