మోడీ కాళ్లు మొక్కిన విజయసాయిరెడ్డి?: వైసీపీ ద్వంద్వ నీతా?, ఎందుకింత సాగిలపడుతున్నారు!
Recommended Video
న్యూఢిల్లీ: ఏపీ రాజకీయాల్లో టీడీపీ వైసీపీల మధ్య ఇప్పుడు తీవ్రమైన ఫైట్ నడుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలపై పోరు విషయంలో తమదంటే తమదే చిత్తశుద్ది అని నిరూపించుకోవడానికి ఇరు పార్టీలు పాకులాడుతున్నాయి.
ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు కూడా. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్థిని ఇరుకునపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ చేతికి ఇప్పుడు మరో అవకాశం చిక్కినట్టే కనిపిస్తోంది.
కాళ్లు మొక్కిన విజయసాయిరెడ్డి:
మోడీకి ఆర్థిక నేరస్తులతో ఏం పని?.. అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకవిధంగా.. బీజేపీ, వైసీపీ కుమ్మక్కై టీడీపీని టార్గెట్ చేశాయనేది ఆ పార్టీ ఆరోపణ.
ఇలాంటి తరుణంలో రాజ్యసభలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంగళవారం రాజ్యసభకు వచ్చిన మోడీ వద్దకు వెళ్లి.. విజయసాయిరెడ్డి ఆయనకు నమస్కారం చేశారు. ఆపై ఆయన పాదాలను తాకి ఆశ్వీరాదం తీసుకున్నారని అంటున్నారు.
వ్యూహాల్లో తలమునకలైన ఇద్దరు?: రాజీనామా అస్త్రంతో జగన్ సంచలనం, టీడీపీకి ఇరకాటమే!
సభ వాయిదా:
మంగళవారం ఉదయం రాజ్యసభ ప్రారంభమవడమే ఆలస్యం.. అన్నాడీఎంకే ఎంపీలు సభలో ఆందోళన చేశారు. కావేరీ బోర్డు ఏర్పాటుకై డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వారిని వారించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. దీంతో సభను 15నిమిషాలు వాయిదా వేశారు.
వైసీపీ ద్వంద్వ నీతి: టీడీపీ ఆరోపణలు
సభ వాయిదా పడ్డా.. ప్రధాని సహా సభ్యులెవరూ బయటకు వెళ్లలేదు. ఆ సమయంలో మోడీ వద్దకు వెళ్లిన ఎంపీ విజయసాయి రెడ్డి ఆయనకు నమస్కారం చేసి కాళ్లకు మొక్కినట్టు చెబుతున్నారు.
ఓ వైపు కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం లేదని అవిశ్వాసానికి నోటీసులు ఇస్తూనే.. మరో పక్క మోడీని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండటం వైసీపీ ద్వంద్వ నీతికి నిదర్శనమని టీడీపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు.
వైసీపీకి చిత్తశుద్ది లేదు
మోడీ కాళ్లు మొక్కి మరీ ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని టీడీపీ ఎంపీలు వైసీపీని ప్రశ్నిస్తున్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే వైసీపీ బీజేపీని ప్రసన్నం చేసుకునే పనిలో పడిందంటున్నారు.
బీజేపీ డైరెక్షన్ లోనే వైసీపీ టీడీపీని టార్గెట్ చేసిందని, విజయసాయి రెడ్డి తీరుతో అవిశ్వాస తీర్మానం పట్ల ఆ పార్టీకి చిత్తశుద్ది లేదన్నది బహిర్గతమైందని టీడీపీ ఆరోపిస్తోంది.