అమిత్ షా తేల్చేశారు: జగన్ పెట్టిన చిచ్చు, బాబుతో కటీఫ్?
వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవని అమిత్ షా తెలంగాణలో చేసిన వ్యాఖ్యలు ఎపికి కూడా వర్తిస్తాయని అంటున్నారు. చంద్రబాబుతో తెగదెంపులకు బిజెపి సిద్ధపడినట్లు తెలుస్తోందని సమాచారం.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్న తీరుపై బిజెపి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తన పార్టీ నాయకులను చంద్రబాబు అప్రమత్తం చేసినప్పటికీ, చివరి నిమిషంలో హెచ్చరికలు చేసినప్పటికీ ఫలితం ఉండేలా లేదు.
సహపంక్తి భోజనం, ఇంటింటికీ అమిత్ షా (ఫొటోలు)
తెలంగాణలో పర్యటిస్తున్న బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా స్పష్టంగానే చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. తెలంగాణలో ఆ మాటలు చెప్పినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆ మాటలు వర్తిస్తాయని అనుకోవచ్చు.
తెలంగాణలోనూ ఆంధ్రప్రేదశ్ రాష్ట్రంలోనూ బిజెపి తెలుగుదేశం పార్టీతో జత కట్టింది. ఎపిలో ప్రభుత్వంలో కూడా చేరింది. కానీ, వచ్చే ఎన్నికల నాటికి సమీకరణాలను పూర్తిగా మార్చేసేందుకు అమిత్ షా సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు.
అమిత్ షా ఏమన్నారు...
రాష్ట్రపతి ఎన్నికల తర్వాత దక్షిణ భారతదేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారబోతున్నాయని అమిత్ షా చెప్పేశారు. అందుకు సిద్ధం కావాలని, రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తమాషా చూడండని ఆయన చెబుతూ వచ్చే ఎన్నికల్లో మనకు పొత్తులుండవని, ఎవరినీ భరించాల్సిన అవసరం లేదని, ఒంటరిగానే అధికారంలోకి రావాలని, నోట్లతో కాదు ప్రజలు ఇష్టపడి వేసే ఓట్లతో మనం గెలవాలని చెప్పారు.
వెంకయ్య చెప్పినా...
అమిత్ షా మాటలు తెలంగాణలో అన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కు కూడా వర్తిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు కొనసాగుతాయని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు చెప్పినప్పటికీ అది జరిగే పని కాదని అమిత్ షా మాటలు తెలియజేస్తున్నాయని అంటున్నారు. వెంకయ్య నాయుడు కూడా అంత స్పష్టంగా ఏమీ చెప్పలేదు. 2019 వరకు పొత్తు ఉంటుందని, తర్వాత పొత్తుల సంగతి చూద్దామని ఆయన అన్నారు.
కెసిఆర్ స్నేహపూర్వకంగానే ఉన్నా....
బిజెపితోనూ కేంద్ర ప్రభుత్వంతోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్నేహపూర్వకంగానే ఉంటున్నారు. అమిత్ షా తన పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై వెంటనే స్పందించకూడదని కూడా ఆయన పార్టీ నేతలను ఆదేశించినట్లు చెబుతున్నారు. అయినా, ఉపేక్షించకూడదనే ఉద్దేశంతోనే బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో చంద్రబాబుతో తెగదెంపుల దిశగానే బిజెపి ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి కూడా అర్థమవుతోంది. చంద్రబాబు బిజెపితో తెగదెంపులు జరుగుతాయనే వాస్తవాన్ని జీర్ణం చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. జగన్తో మోడీ భేటీ టిడిపి నాయకులు చేసిన వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య సంబంధాలను చాలా వరకు దెబ్బ తీశాయి.
చంద్రబాబుపైకే అస్త్రం
జగన్ ప్రధాన మంత్రిని కలిసిన సంఘటనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బిజెపి నాయకులు నేరుగానే స్పందిస్తున్నారు. మోడీతో జగన్ భేటీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు యడ్లపాటి రఘునాథబాబు వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి చంద్రబాబును చిక్కుల్లో పడేయాలని బిజెపి వ్యూహం రచించినట్లుగా అర్థం చేసుకోవచ్చు.
ఇలా అర్థం వస్తోందని...
కేసుల నుంచి బయట పడేందుకే ప్రధాని మోడీని జగన్ కలిశారని ముఖ్యమంత్రి మాట్లాడటం చూస్తే ప్రధాని అధికారాన్ని దుర్వినియోగం చేస్తారని చంద్రబాబు మాట్లాడినట్లుగా ఉందని రఘునాథ బాబు అన్నారు. ముఖ్యమంత్రి కూడా ప్రధానిని ఎన్నోసార్లు కలిశారని గుర్తు చేస్తూ చంద్రబాబుపై ఉన్న కేసుల నుంచి తప్పుకొనేందుకు ప్రయత్నించారా అని ప్రశ్నించారు. మిత్రపక్షం అభివృద్ధి చెందుతుంటే కొందరు సహించలేక పోతున్నారని చెప్పారు.
కేశినేని వ్యాఖ్యలపై..
బీజేపీ పొత్తు లేకపోతే మరింత మెజారిటీ వచ్చేదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మాట్లాడటం శోచనీయమని రఘునాథబాబు అన్నారు. ఈ నెల 25న జాతీయ అధ్యక్షుడు అమితషా విజయవాడ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై కూడా మాట్లాడే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
మేం గట్టిగా మాట్లాడితే..
ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును బిజెపి నాయకులు బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆక్షేపించారు. 2019 ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరని కూడా ఆయన అన్నారు. ఈ నెల 25 వ తేదీన విజయవాడలో అమిత్షా సభను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, పూడి తిరుపతిరావు, లక్ష్మీపతి రాజ తదితరులతో కలిసి మాట్లాడారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తాము మిత్ర ధర్నాన్ని పాటిస్తున్నామని చెప్పారు. రాజమండ్రిలో, తాడేపల్లి గూడెంలో అమిత్షా సభలు జరగడానికి ముందు, ఇప్పుడు విజయవాడలో జరగనున్న సభకు ముందు టీడీపీ నాయకులు మిత్ర ధర్మం విడిచి మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.తాము గట్టిగా స్పందిస్తే సీఎం చంద్రబాబునాయుడు బీజేపీ గురించి మాట్లాడవద్దని చెబుతారని, అయినా కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారని ఆయన అన్నారు.
టిడిపిపై ఘాటుగానే...
ఎన్డీఎతో కలవడం వల్లే టీడీపీ గెలిచిందన్న విషయాన్ని కేశినేని నాని మర్చిపోకూడదని సోము వీర్రాజు అన్నారు. టీడీపీ వాఖ్యలపై స్పందించకుండా ఉండడానికి తమది ఛారిటబుల్ ట్రస్ట్ కాదని, జాతీయ పార్టీ అని ఘాటుగా అన్నారు. మోడీని వైఎస్ జగన్ కలవడంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అంటూ కేసుల్లో ఉన్న వ్యక్తిని ప్రతిపక్ష నాయకుడుగా చేసింది వారు కాదా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై...
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులను చంద్రబాబు టిడిపిలో చేర్చుకోవడంపై కూడా సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. కేసుల్లో ఉన్న నాయకుడు అధినేతగా ఉన్న పార్టీలోంచి ఎమ్మెల్యేలను తీసుకుని, వారికి మంత్రి పదవులు ఎలా ఇచ్చారని ఆయన చంద్రబాబును నిలదీశారు.
చంద్రబాబు నాటకంలా ఉంది...
మిత్రపక్షంపై రకరకాల వ్యాఖ్యలు చేయడం తెలుగుదేశం పార్టీ నాయకులకు అలవాటేనని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడలో సోమవారం ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నేతల వ్యాఖ్యలు, అలా వ్యాఖ్యలు చేసినప్పుడు తగ్గాల్సిందిగా వారికి చంద్రబాబు చెప్పడం ఓ నాటకంలా ఉందన్నారు. కాగా, 2019 వరకూ పొత్తు ఉంటుందని వెంకయ్య స్పష్టం చేశాక ఇక ఎవరు ఏం మాట్లాడినా తప్పే అవుతుందని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.