టార్టెట్ 2019:50 మంది సిట్టింగ్లకు బాబు నో ఛాన్స్
అమరావతి: 2019 ఎన్నికలకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పించుకొంటున్నారు. పనితీరు సక్రమంగా లేని ఎమ్మెల్యేలు, ఎంపీలపై వేటు ఖాయమని చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు. కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో స్థానిక ఎమ్మెల్యేల పనితీరుపై సమాచారం తెప్పించుకొన్న బాబు వారిని ఎన్నికల ప్రచారంలో దూరం ఉంచాలని పార్టీ సీనియర్లను ఆదేశించారు.
నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వైసీపీని ఓడించిన ఉత్సాహంలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు 2019 ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నారు. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల పనితీరును ఆయన అంచనావేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పార్టీ పనితీరుపై ఆయన ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకొంటున్నారు. ఈ నివేదికల ఆధారంగా పార్టీ వ్యవహరాలను చక్కబెడుతున్నారు.అంతేకాదు పాలనలో పారదర్శకత కోసం ప్రజల నుండి సమాచారాన్ని తెప్పించుకొంటున్నారు. ఈ సమాచారం ఆధారంగా పాలనలో మార్పులు చేర్పులు చేస్తున్నారు.
కీలకమైన నంద్యాల ఉపఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి ఘన విజయం సాధించడంతో వైసీపీ నేతలను ఆత్మరక్షణలో పడేశారు చంద్రబాబునాయుడు. ఈ తరుణంలో పార్టీ పరిస్థితిపై కేంద్రీకరించారు.

50 మంది సిట్టింగ్లకు నో ఛాన్స్
2019 ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న 50 మందికి టిక్కెట్టు నిరాకరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్గంగా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై చంద్రబాబునాయుడు నివేదికలను తెప్పించుకొంటున్నారు.ఈ నివేదికల ఆధారంగా సుమారు 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదని తేలింది. ఈ నివేదికల ఆధారంగా ఆయా ఎమ్మెల్యేలకు బాబు హెచ్చరికలు కూడ జారీ చేశారు. కానీ, పరిస్థితుల్లో మార్పు రానందున, వచ్చే ఎన్నికల్లో 50మందిని మార్చి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు.

కాకినాడ ఎమ్మెల్యేపై అసంతృప్తిపై సీనియర్లకు సూచన
కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఇంటలిజెన్స్తో పాటు ఇతరుల నుండి సమాచారాన్ని సేకరించారు. అయితే కాకినాడ కార్పోరేషన్ పరిధిలో ఉన్న టిడిపి ప్రజాప్రతినిధులపై ఉన్న అసంతృప్తి కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని చంద్రబాబునాయుడు ఎన్నికలకు ఇంచార్జీలుగా ఉన్న నేతలతో చర్చించారు. కాకినాడ ఎమ్మెల్యే వెంకటేశ్వరావు, పిల్లి అనంతలక్షిపై స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయాన్ని ఆయన పసిగట్టారు. ప్రచార సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని బాబు సూచించారు. కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే వెంకటేశ్వర్రావు సోదరుడి కొడుకు ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఎమ్మెల్యేపై అసంతృప్తి ఆ డివిజన్లో వైసీపీ గెలుపుకు కారణమైందని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

వరుస విజయాలతో జోష్లో ఉన్న బాబు
నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించింది. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి 28వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాకినాడ కార్పోరేషన్ను టిడిపి కైవసం చేసుకొంది. ఈ తరుణంలో చంద్రబాబునాయుడు పనితీరు బాగాలేని ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారికి అవకాశాన్ని కల్పించేందకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు 50 మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు దక్కకపోవచ్చు. అయితే సిట్టింగ్ల స్థానంలో కొత్తవారికి అవకాశం దక్కనుంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో బాబు అనుసరించిన వ్యూహం సత్పలితాలను ఇవ్వడంతో చంద్రబాబునాయుడు ఈ నిర్ణయానికి వచ్చారని పార్టీవర్గాల్లో చర్చ సాగుతోంది.

నివేదికల ఆధారంగా సూచనలు
పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల పనితీరుపై చంద్రబాబునాయుడు పలుమార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ప్రజలు ఆయా నేతల గురించి ఏమనుకొంటున్నారు. ఏ విషయాల్లో నేతల తీరు సక్రమంగా లేదు. ఏ అంశాలను సరి చేసుకోవాల్సి ఉందనే విషయాలపై బాబు నివేదికలను తెప్పించుకొంటున్నారు. ఈ నివేదికల ఆధారంగా కొందరు నేతలకు సలహలిచ్చారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. అయితే 2019 ఎన్నికల నాటికి పద్దతిని మార్చుకోని నేతలపై వేటు పడే అవకాశం లేకపోలేదు. అయితే ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు 50 మంది సిట్టింగ్లపై బాబు వేటేయనున్నారని సమాచారం. అయితే ఈ వేటు ఎవరిపై పడనుందోననే ఆందోళన సర్వత్రా నెలకొంది.












Click it and Unblock the Notifications