సర్వే షాక్: మోడీ నిర్ణయానికి 93శాతం ప్రజల మద్దతు
నరేంద్ర మోడీ ప్రత్యేక యాప్ ద్వారా చేపట్టిన సర్వేలో పాల్గొన్న 5 లక్షల మందిలో.. 93 శాతం ప్రజలు రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించారు.
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయానికి ప్రజల నుంచి భారీ ఎత్తున మద్దతు లభించింది. నరేంద్ర మోడీ ప్రత్యేక యాప్ ద్వారా చేపట్టిన సర్వేలో పాల్గొన్న 5 లక్షల మందిలో.. 93 శాతం ప్రజలు రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించారు. ప్రభుత్వ నల్లధన నిర్మూలన చర్యలు అద్భుతంగా ఉన్నాయని 73 శాతం మంది అభిప్రాయపడగా.. 20 శాతం మంది బాగున్నాయని అన్నారు.
నోట్ల రద్దు వల్ల నల్లధనం, ఉగ్రవాదం, అవినీతిలపై తక్షణమే ప్రభావం పడుతుందని 50 శాతం మంది అభిప్రాయపడగా.. మధ్యశ్రేణి నుంచి దీర్ఘకాలంలో ఫలితాలు సాధించొచ్చని 42 శాతం మంది పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం చర్యలు బాగున్నాయని 92 శాతం మంది కితాబిచ్చారు. గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన కొంతమంది ఇప్పుడు నల్లధనానికి మద్దతుగా నిలుస్తున్నారా? అన్న ప్రశ్నకు 86 శాతం మంది అవునని సమాధానమివ్వడం గమనార్హం.
నల్లధనంపై పోరులో భాగంగా ఎదురయ్యే ఇబ్బందులను పట్టించుకోబోమని 43 శాతం మంది చెప్పగా.. కొన్ని సమస్యలున్నా, ఇబ్బందులను ఎదుర్కునేందుకు సిద్ధమని 48 శాతం మంది అన్నారు. 24 గంటల వ్యవధిలో జరిగిన ఈ సర్వేలో 5లక్షలకు పైగా ప్రజలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. సర్వే ఫలితాలపై మోడీ ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు.
I thank people for the historic participation in the survey. Its satisfying to read the insightful views & comments. https://t.co/xf14LEiQHT pic.twitter.com/cGSBPlCnE5
— Narendra Modi (@narendramodi) 23 November 2016
కాగా, నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న సమయంలో తాజా సర్వేలో ఇలాంటి ఫలితాలు వెలువడటం విశేషం. అయితే ఈ ఫలితాలు పూర్తి పరిస్థితికి అద్దం పట్టట్లేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఏదేమైనా ఇటీవల నిర్వహించిన సీ ఓటర్ సర్వే, ఇప్పుడు నిర్వహించిన నరేంద్ర మోడీ యాప్ సర్వే ఫలితాలు విపక్షాలకు కొంత షాక్కు గురిచేసినట్లు తెలుస్తోంది.