చంద్రబాబు ఐడియా: సన్ రైజ్ కంట్రీ (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కొత్త ఐడియా వచ్చేసింది. ఆ ఐడియాను కేరళను ‘‘గాడ్స్ ఓన్ కంట్రీ''గా పిలుస్తారని, అదే విధంగా భవిష్యత్లో ఆంధ్రప్రదేశ్ను ‘సన్ రైజ్ కంట్రీ'గా మారుస్తామని ఆయన చెప్పారు. పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటిని ఒకే చోట కేంద్రీకృతం చేయకుండా అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి విస్తరించేలా వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తామన్నారు.
శుక్రవారం లేక్వ్యూ అతిథి గృహంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఉపాధి రంగాలపై చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్యానవన కమిషనరేట్ను, పశ్చిమగోదావరి జిల్లాలో మెరైన్ వర్సిటీని, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పెట్రో కెమికల్ వర్సిటీని ఏర్పాటు చేస్తామని, విశాఖ జిల్లాలో ఐటీ హబ్తోపాటు పారిశ్రామికంగానూ అభివృద్ధి చేస్తామని, రాష్ట్ర వాణిజ్య రాజధానిగా మారుస్తామని, విశాఖను హ్యాపీ సిటీగా రూపొందిస్తామని చంద్రబాబు చెప్పారు.
1995-2004 మధ్య కాలంలో హైదరాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమల స్థాపనకు పెద్ద పీట వేసి హైదరాబాద్ను ప్రపంచ స్థాయిలో ఐటీ హబ్గా రూపొందిచామని వివరించారు. 1997-2004 మధ్య కాలంలో ఈ రంగంలో 61.4 శాతం వృద్ధి ఉంటే.. 2004-14 మధ్య కాలంలో ఇది 29.40 శాతానికి పడిపోయిందని అన్నారు.
చంద్రబాబుకు పరకాల తోడు
ఐడియాలను ముందుకు తీసుకురావడంలో ప్రభుత్వ సలహాదారుగా పరకాల ప్రభాకర్ చంద్రబాబు నాయుడికి తోడయ్యారు.
నీకింత - నాకు కొంతతో...
ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల ఎకరాలను రైతుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా లాక్కొందని చెప్పారు. పరిశ్రమల పేరిట భూములు లాక్కోవడంలో ‘క్విడ్ ప్రొ కో' విధానాన్ని అమలు చేసి ‘నీకింత-నాకు కొంత' పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు.
అదే జరిగిందని చంద్రబాబు
బ్రహ్మణి స్టీల్స్, లేపాక్షి హబ్ విషయంలో నీకింత - నాకు కొంత పద్ధతి అమలు జరిగిందని చంద్రబాబు అన్నారు. కనీసం పనులు ప్రారంభించకుండా పైసా పెట్టుబడి పెట్టకుండా ఈ భూములు తీసుకుని ఇందులో 4,397 ఎకరాలు తాకట్టుపెట్టి 790 కోట్ల రుణం తీసుకున్నారని చంద్రబాబు చెప్పారు.
బ్రాండ్ ఇమేజ్ పోయింది
వాన్పిక్ గురించి చెప్పనక్కరలేదని చంద్రబాబు అన్నారు. ఇలాంటి చర్యల ద్వారా పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను పోగొట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవినీతి ఖండాంతరాలకు..
టైటానియం ఒప్పందాల్లో అవినీతి ఖండాంతరాలకు వ్యాపించిందని చంద్రబాబు అన్నారు. పరిశ్రమల పేరిట భూములు తీసుకున్నప్పటికీ ఎలాంటి పురోగతి లేకుంటే అలాంటి భూములు స్వాధీనం చేసుకుంటామని చంద్రబాబు చెప్పారు.
పర్యాటక రంగానికి ప్రాధాన్యం
రాష్ట్రంలో పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, తోళ్ల పరిశ్రమను వృద్ధి చేస్తామని అన్నారు. అదే విధంగా సహకార చక్కెర కర్మాగారాలను పునరుద్ధరిస్తామని వివరించారు.
మౌలిక సదుపాయాలు..
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల వృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు చెప్పారు. పీసీపీఐఆర్ సాధించుకోవడం అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి కోసం 11 రంగాల వారీగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు వివరించారు.
హైదరాబాదు నుంచి తరలించుకు వెళ్లం
హైదరాబాద్నుంచి ఐటీ పరిశ్రమను తరలించుకుపోవాలన్న అభిప్రాయం తనకు లేదని, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రెండూ అభివృద్ధి చెందాలని చంద్రబాబు అన్నారు.
పనితనం ప్రారంభం
రాష్ట్రంలో ఇప్పటికే పనితనం మొదలైందని, మున్ముందు జర్నలిస్టులకు రాసుకునేందుకు వీలులేనంత పని ఉంటుందని చంద్రబాబు అన్నారు. ఆగస్టు 15ను కర్నూలులో జరుపుతానని అన్నారు.
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్
ఈసారి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. వ్యవసాయానికి ప్రాధా న్యం ఇస్తూ పనిచేయాలని, రైతుల ఆదాయం పెంచడానికి గట్టి ప్రయత్నం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.