మోడీపై ప్రియాంక పోటీ చేయాలనుకున్నారా?
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ఆసక్తికరమైన పోరు జరగకుండా కాంగ్రెసు అధిష్టానం నిలువరించింది. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై వారణాసిలో ప్రియాంకా గాంధీ పోటీ చేయాలని అనుకున్నారట. ఈ మేరకు సోమవారం జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, కాంగ్రెసు అధిష్టానం ప్రియాంకా గాంధీ పోటీకి ఇష్టపడలేదని అంటున్న్నారు.
ప్రియాంకా గాంధీ నరేంద్ర మోడీపై పోటీ చేసి ఉంటే, దేశవ్యాప్తంగా ఓ ప్రధాన చర్చనీయాంశంగా మారి ఉండేది. ప్రస్తుతం ప్రియాంక తన తల్లి, సోదరుడు పోటీ చేస్తున్న రాయబరేలీ, అమేథీల్లో ప్రచారానికి పరిమితమయ్యారు. దేశానికి అత్యంత ప్రమాదకారిగా పరగిణిస్తూ మోడీని ప్రధాని కాకుండా నిలువరించడానికి ప్రియాంకా గాంధీ పోటీ చేయాలని అనుకున్నారట.
వారణాసిలో మోడీపై తాను పోటీ చేస్తే కాంగ్రెసు కార్యకర్తల్లో, నేతల్లో ఉత్సాహం పెరుగుతుందని ఆమె భావించినట్లు చెబుతున్నారు. కాంగ్రెసు నాయకులు పలువురు పోటీ చేయడానికి వెనకాడుతున్న సమయంలో తాను రిస్క్ తీసుకోవడానికి ముందుకు వస్తే వారిలో నైతిక బలం పెరుగుతుందని భావించినట్లు చెబుతున్నారు. తాను మోడీపై ఒకవేళ ఓడిపోతే ఫలితాలు వెలువడిన తర్వాతనే బయటపడుతుంది కాబట్టి ఎన్నికల వరకు మాత్రం కాంగ్రెసుకు ఉపయోగపడేదని ఆమె అనుకున్నారట.
ప్రియాంకా గాంధీ ప్రతిపాదనను కాంగ్రెసు అధిష్టానం తిరస్కరించినట్లు చెబుతున్నారు. మొత్తంమీద, అత్యంత ప్రతిష్టాత్మకమైన పోరును కాంగ్రెసు అధిష్టానం ఆ రకంగా నిలువరించింది. వారణాసిలో మోడీపై తనను పోటీ చేయకుండా కుటుంబ సభ్యులు నిలువరించలేదని ప్రియాంక గాధీ చెప్పారు.