కోర్టుతో గొడవకు నో: రోజాకు పక్కా ప్లాన్తో బాబు చెక్
హైదరాబాద్: వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. కోర్టు సెక్షన్ 340(2)ను తప్పుబట్టిన నేపథ్యంలో.. న్యాయస్థానాలతో ఘర్షణ వాతావరణం లేకుండా వ్యవహరించేందుకు సిద్ధమైందంటున్నారు.
సోమవారం నాడు శాసన సభలో రోజాకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అదే సమయంలో రోజా అంశాన్ని ప్రివిలేజ్ కమిటీ చేతికి ఇచ్చింది. ప్రివిలేజ్ కమిటీ ఎదుట రోజా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత చర్యలపై నిర్ణయం ఉండనుంది.
హైకోర్టు రూల్ 340(2)ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆ రూల్ ప్రకారం ఒక సెషన్కు మాత్రమే సస్పెండ్ చేయాలని, ఏడాది సస్పెండ్ చేయవద్దని సూచించింది. అంతిమంగా సభకు నిర్ణయం తీసుకునే బాధ్యతను అప్పగించింది. దీనినే ఇప్పుడు ఉపయోగించుకోవాలని టిడిపి ప్రభుత్వం చూస్తోంది.
న్యాయవ్యవస్థతో ఘర్షకు దిగారనే మాట పడకుండా, రోజా వాదన వినకుండానే వేటు వేశారనే అపవాదు రాకుండా, అలాగని చర్యల్లేకుండా వదిలేయకుండా.. ఇది అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఒక్క నిర్ణయంతో పలు సమస్యలకు పరిష్కారం కనుగొన్నట్లుగా కనిపిస్తోంది.
రూల్ 340(2)ను ప్రశ్నించిన హైకోర్టు సింగిల్ బెంచ్, రోజా తీరును మాత్రం సమర్థించలేదు. దీనినే ఇప్పుడు ఆయుధంగా ఉపయోగించుకోనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోజాపై సస్పెన్షన్ విధించాలని ప్రివిలేజ్ కమిటీ చెప్పినప్పటికీ... ఆమెకు ఓసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే, ఆమె హక్కుల కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చేదాకా సస్పెన్షన్ కొనసాగనుంది. తద్వారా రూల్ 340(2) ప్రకారం విధించిన సస్పెన్షన్ వెనక్కి పోయినట్లుగా భావించవచ్చు. అప్పీలుపై ధర్మాసనం ఆదేశాలు ఉన్నప్పటికీ.. ప్రివిలేజ్ కమిటీ సిఫార్సులను అమలు చేసేందుకు ఎలాంటి అడ్డంకీ ఉండదు.
పైగా రోజాకు మరో అవకాశం ఇచ్చామనే ఖ్యాతి దక్కుతుందని టిడిపి భావిస్తోందని తెలుస్తోంది. ఇదే సమయంలో క్షమాపణ చెబితే, చర్యలు ఉండవని సభలో, కోర్టులో చెబుతున్నారు. తద్వారా తమకు రోజాపై కక్ష లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఇతర ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పారని, అదే అవకాశం రోజాకు ఇచ్చామని, ఆమె మాత్రం ససేమీరా అంటున్నారని ప్రభుత్వం అంటోంది. మళ్లీ ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు ఇచ్చే వరకు రోజా పైన సస్పెన్షన్ కొనసాగుతుంది. ఆమె హాజరై, వివరణ ఇచ్చాక, నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కమిటీ నివేదిక ద్వారా ఆమెపై చర్యలు తీసుకునే అవకాశముంది.
ప్రివిలేజ్ కమిటీముంద రోజా హాజరు కావడానికి అసెంబ్లీ అనుమతి ఇచ్చాక ఇందులో కోర్టు జోక్యానికి ఇక అవకాశం ఉండదని అంటున్నారు. హైకోర్టు ఉత్తర్వును అసెంబ్లీ అమలు చేయలేదన్న ఫిర్యాదుకు కూడా అప్పుడు అవకాశం ఉండదని అంటున్నారు.