కాంగ్రెస్ ఎత్తు, షాకిస్తూ కేసీఆర్ పైఎత్తు: గౌడ్కు ఛాన్స్
హైదరాబాద్: తెరాస, కాంగ్రెస్ పార్టీల మధ్య ఎత్తుకు పైఎత్తులు నడుస్తున్నాయి. కాంగ్రెస్కు చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు తెరాస గూటికి చేరడంతో కంగుతిన్న కాంగ్రెస్ వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శనివారం పిటిషన్ దాఖలు చేసింది. ఇది జరిగిన కాసేపటికే కాంగ్రెస్ ఎత్తులను చిత్తు చేస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో ఉన్న తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్థానంలో కొత్త చైర్మన్ ఎన్నిక ప్రక్రియకు తెరాస తెరలేపింది. దీంతో శాసనమండలి రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.
మెజార్టీ ఎమ్మెల్యే స్థానాలను గెల్చుకొని తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెరాసకి శాసన మండలిలో ఉన్న ఎమ్మెల్సీలు మహమూద అలీ, కె స్వామిగౌడ్, పాతూరి సుధాకర్ రెడ్డి మాత్రమే. ఎన్నికల ముందు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పి నరేందర్ రెడ్డి తెరాసలో చేశారు. విభజన అనంతరం ఇటీవల గవర్నర్ కోటాలో తెరాస నుంచి నాయిని నర్సింహా రెడ్డి, రాములు నాయక్ ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యారు.
రాష్ట్ర విభజన బిల్లులో 40 మంది సభ్యులతో తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఏర్పాటును నిర్దేశించారు. ఇందులో ప్రస్తుతం 35 మంది మాత్రమే సభ్యులు ఉండగా, రెండు రోజుల కిందట ఐదుగురు ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా తెరాస తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మండలిలో కాంగ్రెస్ బలం 12కు పడిపోయింది. అదే సమయంలో టీడీపీ నుంచి ఇద్దరు, పీఆర్టీయూ నుంచి ఇద్దరు చొప్పున ఎమ్మెల్సీలు కారు ఎక్కారు. దీంతో టీఆర్ఎస్ బలం 15కి చేరింది. ఈ పరిణామంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఉలిక్కిపడింది.
మండలిలో కాంగ్రెస్ పక్ష నేత డి శ్రీనివాస్ శనివారం అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాంను కలిసి తమ పార్టీ నుంచి తెరాసలో చేరిన ఐదుగురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ తగిన ఆధారాలతో పిటిషన్ దాఖలు చేశారు. డీఎస్ ఫిర్యాదును అందజేయగా.. మరి కొద్దిసేపటికి కేసీఆర్ గవర్నర్ వద్దకు వెళ్లి శాసన మండలి చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టటానికి మండలి సమావేశాలు నిర్వహణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేశారు.
కాంగ్రెస్ నుంచి చైర్మన్ పదవిలో ఉన్న వారిని గద్దె దించి కొత్త చైర్మన్ ఎన్నికకు అధికార తెరాస రంగం సిద్ధం చేస్తోంది. తిరుపతి వెళ్లిన మండలి చైర్మన్ విద్యాసాగర్ వెంటనే తిరుపతి నుంచి హైదరాబాద్కు చేరుకున్నప్పటికీ, 29న ఆదివారం కావటంతో కాంగ్రెస్ సమర్పించిన అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్న వారికి ఏడు రోజుల గడువుతో నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ ప్రక్రియ ఏమీ జరగకుండానే తెరాస ప్రభుత్వం సోమవారం లేదా మంగళవారం చైర్మన్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధం చేస్తోందంటున్నారు.
అనంతరం నామినేషన్ల స్వీకరణ చేపట్టి జూలై 2న శాసనమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి చైర్మన్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేస్తారంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ తన క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి హరీశ్ రావు తదితరులతో భేటీ అయ్యారు. చైర్మన్గా స్వామిగౌడ్ను కూర్చోబెట్టాలని సూత్రప్రాయంగా సమావేశంలో నిర్ణయించారు.