అమరావతి భూదందా: కౌంటర్కి చంద్రబాబు ప్లాన్..!
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో బినామీలతో భూముల దందా అంటూ సాక్షిలో వరుస కథనాలను ప్రచురించడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అమరావతి భూముల కొనుగోలులో అధికార పార్టీకి చెందిన నేతలు కోట్ల రూపాయలు లభ్ది పొందుతున్నారంటూ కథనాలు రావడంతో రెండు రాష్ట్రాల్లో అమరావతి భూములపైనే తీవ్ర చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో అమరావతి భూమలపై పెను దుమారం చెలరేగుతోంది. అమరావతి భూముల వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన మంత్రులతో పాటు సీఎం కుమారుడు నారా లోకేశ్ హస్తం కూడా ఉందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా కంగుతిన్నారు.
ఎవరెవరిపైన అయితే ఆరోపణలు వచ్చాయో ఆ మంత్రులు తాము రాజధాని ప్రాంతంలో ఎలాంటి భూములను కొనుగోలు చేయలేదని మీడియా ముందుకొచ్చి మరీ తనగోడును వెళ్లబోసుకున్నారు. అయితే ప్రతిపక్ష నేతలు మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
మార్చి 5 నుంచి ఏపీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమరావతి భూముల వివాదంపైనే పెద్ద ఎత్తున అసెంబ్లీలో చర్చ జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. తమపై ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేతలకు అసెంబ్లీలోనే గట్టి కౌంటర్ ఎటాక్ ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నారు.
ఈ క్రమంలో అమరావతి చుట్టుపక్కల గ్రామాల్లో వైసీపీ నేతలు ఎవరెవరు ఏయే భూములను కొన్నారనే విషయాన్ని టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. వైసీపీ నేతలకు చెక్ చెప్పేందుకు ప్రభుత్వం మంత్రులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఈ కమిటీలోని సభ్యులు ఇప్పటికే రాజధాని అమరావతి చుట్టుపక్కల వైసీపీ నేతలు ఎవరెవరు ఏయే భూములను కొనుగోలు చేసింది, ఎవరెవరు ఏయే వ్యాపారాలు చేస్తున్నారనే లాంటి అన్ని విషయాలపై టీడీపీ నేతలు కూపీ లాగుతున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల రాజధాని భూ వ్యవహారంతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లనుంది.
ఏపీ ప్రభుత్వం మరోవైపు రెవెన్యూ వెబ్సైట్ను నిలిపివేయడాన్ని వైసీపీ టార్గెట్ చేసుకుంది. ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీలో అమరావతి భూముల దందాపై పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అమరావతి భూముల భాగోతంపై అధికార పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరిగా వివరణ ఇస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ... ఏపీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరగుతాయని అందరూ భావిస్తున్నారు. సాక్షిలో వచ్చిన కథనాలకు గట్టి కౌంటర్ ఇవ్వాలనే పనిలో తెలుగుదేశం పార్టీ నేతలు నిమగ్నమయ్యారని తెలుస్తోంది. మరోవైపు రాజధాని భూదందాపై వైసీపీ నేతలు కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని భావిస్తున్నారు.
వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ ఈ వ్యవహారంపై శుక్రవారం మాట్లాడుతూ దీనిపై ఏ స్థాయికైనా వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజధాని అమరావతిలో జరిగిన భూదందా ఆరోపణలు కాదని వాస్తవమేనని అన్నారు. రాజధాని అమరావతిలో ప్రకటించిన తర్వాత సీఎంకు సన్నిహితులు, మంత్రులు కొనడమే ఇందుకు నిదర్శనమన్నారు.
భూములను కొనుగోలు చేసిన తర్వాత వాటిని బినామీల పేర్లమీద పెట్టడం కూడా నిజమేనన్నారు. రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ భూములను సాక్షాత్తూ మంత్రులే తమ పేర్లు మీద రాయించుకోవడం దారుణమన్నారు. రాజధాని భూదందా పేరుతో వాస్తవాలను వెలికితీసిన పత్రికను అభినందించాలన్నారు.
రాజధాని భూదందాపై రాష్ట్ర ప్రజానీకం విస్తృత పోయిందన్నారు. రాజధానిలో భూదందా జరుగుతుందని తమ పార్టీ అధినేత ముందే చెప్పారని అది ఇప్పుడు నిజమైందన్నారు. అమరావతి భూములపై అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తామన్నారు. దీనిపై సీబీఐ ఎంక్వైరీని కోరుతామన్నారు.
సీఎం చంద్రబాబు అమరావతిలో భూములు కొనుక్కుంటే తప్పేంటని అడుగుతున్నారని, ఆ వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టమన్నారు. అయితే అమరావతిలో భూములు కొనుగోలు చేసిన వ్యక్తుల స్థోమత ఏంటనేది ఒక్కసారి ఆలోచించాలన్నారు.
రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు అనేవి ఆరోపణలు కావని, వాస్తవాలని తమ పార్టీ విశ్వసిస్తోందన్నారు. హాయ్ల్యాండ్ వ్యవహారం కోర్టులో ఉందని, అందులో నారా లోకేశ్కి అంటగట్టారు బుద్ది ఉందా అన్న మాటలకు హాయ్ లాండ్ అన్నది కోర్టు ఎటాచ్మెంట్లో లేదని కానీ సీఎం చంద్రబాబు మాత్రం అటాట్మెంట్లో ఉందని జనానికి చెబుతన్నారన్నారని ధ్వజమెత్తారు.