14 కోట్లిస్తామని 3.54 ఇచ్చారు: టీడీపీ నేతలపై లోకేష్
హైదరాబాద్: కార్యకర్తల సంక్షేమ నిధికి విరాళాలు ప్రకటించినవి రూ.14 కోట్లు అయితే, ఇప్పటి వరకు వచ్చినవి రూ.3.54 కోట్లు మాత్రమేనని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ అన్నారు. గత పది నెలల కారంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 50వేల మంది కార్యకర్తలను తాను కలిశానని శనివారం చెప్పారు.
కార్యకర్తల సంక్షేమం కోసం చేసిన పనుల పైన నివేదికను అందించారు. గత మహానాడులో రూ.14 కోట్ల విరాళాలను నేతలు ప్రకటించారని, అప్పటికే పార్టీ వద్ద ఉన్న రూ.6 కోట్లు జత చేసి రూ.20 కోట్లతో కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించారు.
అయితే, ప్రకటించిన రూ.14 కోట్లలో కేవలం రూ.3.54 కోట్లే అందాయి. ఇవి కాక 80 మంది పార్టీ సానుభూతిపరులు మొత్తం రూ.1.10 కోట్లు విరాళాల కింద అందించారు. ఈ సొమ్ము నుండి రూ.4.63 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు లోకేష్ చెప్పారు.
ఆరోగ్యం, ఆర్థిక సాయం, విద్య తదితర అంశాలకు సంబంధించి పద్నాలుగు వేలకు పైగా దరఖాస్తులు అందాయని, దాదాపు తొమ్మిదిన్నర వేలు పరిష్కరించామని చెప్పారు. పార్టీలని 54 లక్షల మంది కార్యకర్తల సమస్యలు, సలహాలు తీసుకునేందుకు 22 మందితో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పిల్లల వివాహం, ఆరోగ్యం, ఇతర సమస్యల కోసం ఏపీలో 170 మందికి, తెలంగాణలో 286 మందికి సాయమందించినట్లు చెప్పారు.