తెలంగాణలో హంగ్: కాంగ్రెసుకు కెసిఆర్ చేరువ
ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీల నాయకులు కత్తులు దూసుకున్నారు. కాంగ్రెసు నాయకులను కెసిఆర్ తన ప్రచారంలో చీల్చి చెండాడారు. కెసిఆర్ను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా పార్టీ నాయకులు వెన్నుపోటుదారుడని, మోసకారి అని అభివర్ణించారు.
తెరాస అతి పెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ రాదని భావిస్తున్నారు. కొత్త తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం 60 శాసనసభా స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. ఇరు పార్టీల ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెసు, తెరాస కూటమి కట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.
పది వరకు సీట్లు తక్కువ పడితే మజ్లీస్, సిపిఐ మద్దతు కోరాలనే ఉద్దేశంతో కెసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కాంగ్రెసుతో కూటమి కడితే స్థిరమైన ప్రభుత్వాన్ని అందించడానికి వీలవుతుందని తెరాస నాయకులు భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు ఘనత సోనియా గాంధీకే దక్కుతుందని, రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి సహకరిస్తామని కెసిఆర్ ఇటీవల ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో అనడంలోని ఆంతర్యం ఇదేనని అంటున్నారు.
తెరాస ఉత్తర తెలంగాణలో బలాన్ని చాటుకుంటే, దక్షిణ తెలంగాణలో కాంగ్రెసు అత్యధిక సీట్లు సాధించే అవకాశం ఉంది. అయితే, తమ పార్టీ స్వీప్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని కెసిఆర్ భావిస్తున్నారు. చేస్తే తెరాస స్వీప్ చేస్తుందని, లేదంటే హంగ్ వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.