మెట్రో రైలు: ఎల్ అండ్ టీని అబ్బురపరిచిన కేసీఆర్
హైదరాబాద్: ఎల్ అండ్ టీ కంపెనీ రూటు మార్చింది! ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మెట్రో రైలు ప్రాజెక్టు లాభదాయకం కాదని ఆందోళన వ్యక్తం చేస్తూ వరుసగా లేఖలు రాసిన కంపెనీ యాజమాన్యం, ఇపుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని కంపెనీ చైర్మన్ నాయక్ కొనియాడారు. ఈ మేరకు ఆయన కేసీఆర్కు ఒక లేఖ రాశారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి బంగారు తెలంగాణ సాధించాలనే కేసీఆర్ సంకల్పం తనను ఎంతో ఆకట్టుకుందన్నారు.
ఇందుకు ఎల్ అండ్ టీ కంపెనీ తరఫున అన్ని విధాల చేయూత అందిస్తామన్నారు. ఇటీవల కేసీఆర్ను కలిసినపుడు మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపినట్టు చెప్పారు. కేసీఆర్ చొరవ, ముందు చూపు ఉన్న నేత అని ఆయన కొనియాడారు.
ప్రణాళిక, దూరదృష్టి ఉన్న కేసీఆర్ లాంటి నేతల వలనే దీర్ఘకాలిక అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో ఎల్ అండ్ టీ కంపెనీ భాగస్వామి అవుతుందన్నారు. తెలంగాణలో చేపట్టే విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు తమ వంతు సహకారమందిస్తామన్నారు.
సూరత్ సమీపంలోని హజీరాలో ఉన్న తమ కంపెనీ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించేందుకు రావాలని నాయక్ కేసీఆర్ను ఆహ్వానించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆయన రూపొందించిన ప్రణాళిక అబ్బురపరిచిందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.