ప్రభుత్వానికి చంద్రబాబు: పార్టీకి నారా లోకేష్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో పార్టీ విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై దృష్టి సారించనున్నారు. రాజధాని నిర్మాణం వంటి పలు సమస్యలను పరిష్కరించాల్సిన పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. దానివల్ల ప్రభుత్వ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన స్థితిలో పడ్డారు. దీంతో పార్టీ వ్యవహారాలపై ఆయన తనయుడు నారా లోకేష్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చురుకైన పాత్ర పోషించడానికి నారా లోకేష్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు నారా లోకేష్ కోసం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఓ ఛాంబర్ను కేటాయిస్తారని అంటున్నారు. పార్టీ కార్యాలయం మూడు అంతస్థుల్లో ఉంది. కింది అంతస్థులో మీడియా సమావేశం హాలు, కొందరు నేతలకు గదులున్నాయి.

రెండో అంతస్థులో ముప్పాతిక భాగాన్ని తెలంగాణ టిడిపికి కేటాయిస్తారు. దీనికోసం ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. పై అంతస్థులో ఒక వైపు పార్టీ అధినేత చంద్రబాబు ఛాంబర్, సమావేశం హాల్ ఉన్నాయి. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శులు, మరికొందరు నేతలకు విడివిడిగా గదులున్నాయి. ఇప్పుడు వీటిలో రెండు మూడు గదులను కలిపి ఒక ఛాంబర్గా చేసి నారా లోకేష్కు కేటాయిస్తారని అంటున్నారు.
మిగతా గదుల్లో కొన్నింటిని నారా లోకేష్ జట్టుకు కేటాయిస్తారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాలనే కాకుండా తెలంగాణ పార్టీ వ్యవహారాలను కూడా నారా లోకేష్ చూసే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యవహారాలకు దూరంగా ఉండి నారా లోకేష్ పార్టీ వ్యవహారాలపైనే దృష్టి సారించే అవకాశం ఉందని అంటున్నారు. తద్వారా పార్టీపై పూర్తి స్థాయిలో పట్టు సాధించి, 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు రావడానికి ఈ కసరత్తు పనిచేస్తుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications