సునంద హత్య: సీన్లోకి మరో పాత్ర, ఎవరీ క్యాటీ?
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి సునంద పుష్కర్ హత్య కేసులోకి మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో మరో కొత్త పాత్ర రంగం మీదికి వచ్చింది. క్యాటీ అనే మహిళ పేరు తెర మీదికి వచ్చింది. ఈ మేరకు శనివారం జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. సునంద పుష్కర్ మృతి కేసులో దర్యాప్తు అధికారులు 15 మందిని విచారిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. నవంబర్లోనే పోలీసులు 12 మందితో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సారి తగిన విధంగా వారిని విచారించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
సునంద పుష్కర్, శశి థరూర్ మధ్య దుబాయ్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ గొడవకు క్యాటీ అనే మహిళ కారణమని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. శశి థరూర్ పని మనిషి నారాయణ్ విచారణలో ఆమె పేరు వెల్లడించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. అయితే, ఆమెను ఎవరూ గుర్తించినట్లు లేదంటున్నారు. శశి థరూర్ను విచారించిన తర్వాత క్యాటీ అనే మహిళను విచారించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

కాగా, సునంద పుష్కర్ మృతి తర్వాత ఇప్పటి వరకు నోరు విప్పని లీలా ప్యాలెస్ హోటల్ ఉద్యోగి ఒకతన్ని పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సంజయ్ దేవాన్ అనే ఫ్యామిలీ ఫ్రెండ్ను కూడా పోలీసులు విచారిస్తారంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. జనవరి 17వ తేదీ సాయంత్రం సునంద పుష్కర్ నుంచి ఏ విధమైన స్పందన రాకపోవడంతో వైద్యులను పిలువాలని అతను హోటల్ మేనేజర్కు చెప్పినట్లు నారాయణ్ వెల్లడించినట్లు చెబుతున్నారు. సంజయ్ సునంద పుష్కర్ ఆరోగ్యంపై ఆరా తీసినట్లు నారాయణ్ చెప్పాడని అంటన్నారు.
రాకేష్ శర్మ అనే ఫ్యామిలీ ఫ్రెండ్ గురించి కూడా నారాయణ్ ప్రస్తావించినట్లు సమాచారం. దాంతో ఆయనను కూడా ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. థరూర్ను ప్రశ్నించడానికి లేదా మరిన్ని సాక్ష్యాధారాలను సేకరించడానికి సిట్ బృందం కేరళలకు వెళ్లే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications