సీమ నుంచి కాపు: నవ్యాంధ్రలో బాబు బయటపడేనా?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఎన్నికల హామీలు వెంటాడుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. అందులో కొన్నింటిని నెరవేర్చామని, నెరవేర్చుతున్నామని, మిగిలిన వాటిని చేస్తామని టిడిపి చెబుతోంది.
చంద్రబాబు ముందు ఆర్థికపరంగా.. అమరావతి రాజధాని, కొత్త భవన సముదాయాలు, పోలవరం వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక కాపులకు ఇచ్చిన హామీ, రాయలసీమ అసంతృప్తి... ఇలా మరిన్ని సవాళ్లు చంద్రబాబు ముందు ఉన్నాయి.
కొత్త రాష్ట్రం అయినందున ఏపీ అభివృద్ధి, ప్రత్యేకంగా రాజధాని అమరావతి పైన చంద్రబాబు దృష్టి సారించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఎప్పటికప్పుడు చంద్రబాబును సమస్యలు, ఇచ్చిన హామీలు చుట్టుముడుతున్నాయి.
గతంలో విశాఖలో వచ్చిన హుధుద్ తుఫాను, ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ - కూలీల మృతి, గోదావరి పుష్కరాల సమయంలో దుర్మరణ... ఇలా ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. తాజాగా, కాపు గర్జన చంద్రబాబుకు కొత్త చిక్కులు తెచ్చింది.
తాము ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని, వారికి ఇచ్చిన హామీ పైన చిత్తశుద్ధితో ఉన్నామని అందుకే కమిషన్ వేశామని, తొమ్మిది నెలలు ఓపిక పట్టలేరా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఒక్కరోజులోనే కాపు రిజర్వేషన్ అంశం పూర్తి కాదని గుర్తు చేస్తున్నారు.
ఇప్పటికే రాయలసీమ అసంతృప్తి, అమరావతి నిర్మాణం తదితర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబుకు కాపు రిజర్వేషన్ మరింత పెద్ద సమస్య కానున్నట్లుగా కనిపిస్తోంది. ముద్రగడ వెనుక వైసిపి ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బిజెపిలు మద్దతివ్వడం కూడా గమనార్హం.
ఇప్పటికే రాయలసీమను రగిల్చేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు కాపు గర్జనతో చంద్రబాబును ఇరుకున పెట్టాలనే విపక్షాలు భావిస్తున్నాయని అంటున్నారు. చంద్రబాబు వీటి నుంచి ఎలా బయటపడతారనే చర్చ సాగుతోంది.