టెస్ట్: అధికారికి లంచం ఇవ్వజూపిన కేజ్రీవాల్ కూతురు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వంలో అవినీతి ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత స్వయంగా ప్రయత్నించారు. ఎల్ఎల్ ఆర్ కోసం హర్షిత లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినా అధికారి తిరస్కరించారు.
తాను ఎవరో చెప్పకుండా హర్షిత రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లారు. వాహనాన్ని నడపడం నేర్చుకునేందుకు అవసరమయ్యే అనుమతి పత్రం (ఎల్ఎల్ఆర్) కోసం దరఖాస్తు చేశారు. తనవంతు వచ్చేసరికి ముఖ్యమంత్రి కూతురు నిరీక్షించారు.
అవసరమైన పత్రాల్లో ఒకటి లేదనీ, అయితే లైసెన్స్ తనకు అత్యవసరమని ఆమె చెప్పింది. కాబట్టి తాను ఎంత లంచమైనా ఇచ్చేందుకు సిద్ధమని ఆమె అక్కడి అధికారితో చెప్పింది.
ఆమె సెల్ఫోన్లో దానిని చిత్రీకరిస్తుందేమోనని సదరు అధికారి తొలుత అనుమానించాడు. అలాంటిదేమీ లేదని ధృవీకరించుకుంది. అయినప్పటికీ లంచం తీసుకునేందుకు నిరాకరించారు. బయటకు వచ్చిన ఆమె, కొద్ది సేపట్లో మళ్లీ వెనక్కి వెళ్లి మిగిలిన పత్రాన్ని కూడా సమర్పించింది.
అందులో తండ్రిపేరు అని ఉన్నచోట అరవింద్ కేజ్రీవాల్ అనే పేరును అతను చూశాడు. ఆమె ముఖ్యమంత్రి కుమార్తె అవునో కాదో అధికారి అడిగి తెలుసుకున్నారు. అధికారులు తరలి వచ్చి ఆమె పనిని పూర్తి చేశారు. ఆదివారం ఆటో డ్రైవర్ల సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
దీని గురించి చెప్పిన అరవింద్ కేజ్రీవాల్... ఢిల్లీలో లంచం తీసుకోవడం డెబ్బై నుండి 80 శాతం మేర తగ్గిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ఇది జరిగిందన్నారు. తాము వంద శాతం లంచం లేకుండా చేస్తామని చెప్పలేమని, అయితే 80 శాతం వరకు తగ్గిందన్నారు.