రైసినాహిల్స్కు దళితుడు తొలిసారేం కాదు: వరుస ఇదీ..
న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడిగా అందరూ వూహించినట్టుగానే బీజేపీ దళితుణ్ని కేంద్రం రంగంలోకి దించింది. అనేక తర్జనభర్జనల అనంతరం..అనూహ్యంగా ఎవరూ వూహించని రామ్నాథ్ కోవింద్ పేరును తెరపైకి తెచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆయన 14వ రాష్ట్రపతిగా ఎన్నిక కానున్నారు.
ఇదే తరహాలో రాష్ట్రపతి ఎన్నికల్లో అనేకసార్లు వూహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజకీయ వ్యూహ..ప్రతివ్యూహాలకు ఈ ఎన్నికలు వేదికలయ్యాయి. కాకపోతే దళితుడు రైసినా హిల్స్ కు వెళ్లడం ఇదే మొదటి సారేం కాదు.
1997లో కేఆర్ నారాయణ్ అసాధారణ మెజారిటీతో విజయం సాధించి రాష్ట్రపతి భవన్ మెట్లెక్కారు. కానీ ఈనాడు వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి అత్యధిక లోక్ సభ స్థానాలు.. దేశవ్యాప్తంగా దళితుల ఓట్లు కూడగట్టాలన్న యావ తప్ప.. వాస్తవిక, రాజకీయ పరిస్థితిని గుర్తించడానికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ వ్యవహరిస్తున్నదని విపక్షాల నుంచి, రాజకీయ విమర్శకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇలా చైనాతో సత్సంబంధాలు
ఈనాడు బీజేపీ సారథ్యంలో దళిత నేత రామ్ నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లే 1992లో నాటి ప్రధాని పీవీ నర్సింహారావు రాష్ట్రపతిగా బ్రాహ్మణ సామాజిక వర్గ నేత శంకర్ దయాళ్ శర్మ, ఉప రాష్ట్రపతిగా కేఆర్ నారాయణన్ లను ఎన్నుకున్నారు. 1997లో జరిగిన ఎన్నికల్లో కేఆర్ నారాయణన్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతేకాదు 1964లో యుద్ధం తర్వాత చైనాతో సత్సంబంధాలు నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు.
రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఎన్నిక తీరిది
అంతకుముందు ప్రధాని ఇందిరాగాంధీ 1982లో సిక్కుల్లో దిగువ సామాజిక వర్గానికి చెందిన జైల్ సింగ్ను రైసీనా హిల్స్కు పంపారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎన్నికకు 2012లో ఇదే పరిస్థితి నెలకొన్నది. నాడు కాంగ్రెస్ పార్టీకి విధేయుడైన నేతను అంగీకరించేందుకు మిత్రపక్షాలు సుతారామూ అంగీకరించలేదు. దీంతో అందరికీ ఆమోదయోగ్యమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నందున బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ కూడా విపక్షాల వ్యూహాలకు అతీతంగా రామ్ నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.గతంలో రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన వివరాలిలా ఉన్నారు..
జనతా పార్టీ తరుఫున నీలం ఇలా..
తొలి ఏకగ్రీవ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి(1977-82). 1977 జులై 25న ఆయన రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. జనతా పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉండటంతో ఆయనకి ప్రత్యర్థిగా ఎవర్నీ పోటీపెట్టలేదు. రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి పిన్న వయస్కుడు ఈయనే(64 ఏళ్ల వయసులో). ఒకసారి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోయి, గెలిచిన వ్యక్తీ ఈయనే. అంతకుముందు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో వీవీగిరి చేతిలో ఆయన ఓడారు.
రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక ఇలా
తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ 2 సార్లు రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అత్యధిక కాలం రాష్ట్రపతి పీఠం అధిరోహించిన (12 ఏళ్లు) ఘనతా ఆయనదే. జనవరి 26, 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షునిగా, భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1957లో జరిగిన రెండో ఎన్నికల్లోనూ రాష్ట్రపతి బరిలో దిగి, ఉభయ కమ్యూనిస్టు అభ్యర్థి ఎన్ఎన్ దాస్పై గెలిచి ఐదేళ్లపాటు పదవిలో కొనసాగారు.
ఫకృద్దీన్, జాకీర్ హుస్సేన్ ఇలా
ఇద్దరు ముస్లింలకు రాష్ట్రపతి పదవి దక్కగా ఇద్దరూ పదవీకాలం పూర్తికాకుండానే మరణించారు. జాకీర్హుస్సేన్ (1967-69) పీఠాన్ని అధిరోహించిన సరిగ్గా రెండేళ్లలో ఆయన చనిపోయారు. 1967 మే 3న రాష్ట్రపతిగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించగా, 1969 మే 13న తన కార్యాలయంలోనే గుండెపోటులో మరణించారు. అలాగే పదవీకాలంలో ఉండగానే దేశ ఐదో రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ (1974-77) మరణించారు. రెండున్నరేళ్ల పదవీకాలం తర్వాత అధికార నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.
నీలంపై రెండో ప్రాధాన్య ఓటు ఆధారంగా వీవీ గిరి ఎన్నిక
నాలుగో రాష్ట్రపతి వీవీగిరి ఎన్నిక, అనంతర పరిణామాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తొలి తాత్కాలిక రాష్ట్రపతిగా వీవీగిరిగా పని చేశారు. జాకీర్హుస్సేన్ హఠాన్మరణం అనంతరం ఆయన స్థానంలో అప్పటి ఉప రాష్ట్రపతి వీవీగిరిని తాత్కాలిక రాష్ట్రపతిగా నియమించారు. 1969 మే నెల 3 నుంచి 1969 జులై 20, వరకు పనిచేశారు. నాటి ఎన్నికల్లో తొలి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది. కాంగ్రెస్ తరఫున నీలం సంజీవరెడ్డి పోటీ చేయగా, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పరోక్ష మద్దతుతో ఈయన ఇండిపెండెంట్గా బరిలో దిగారు.
ఆగస్టు 16, 1969న రాష్ట్రపతి ఎన్నిక జరగ్గా.. ఇందిరాగాంధీ ‘ఆత్మ ప్రబోధానుసారం' అన్న నినాదంతో ఈయన్ని గెలిపించి పంతం నెగ్గించుకున్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో రాష్ట్రపతిగా ఎన్నికైందీ ఈయనే. నీలం సంజీవరెడ్డి, వీవీ గిరి, సీడీ దేశ్ముఖ్ల మధ్య పోటీ జరిగింది. ప్రధాన పోటీదారు సంజీవరెడ్డి గట్టిపోటీ ఇచ్చారు. తొలిసారి జరిగిన లెక్కింపులో ఇద్దరికీ దాదాపు సమానమైన ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు జరగ్గా.. వీవీగిరికి 50.22 శాతం ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 0.22 శాతం ఓట్ల మెజారిటీతో గెలిచారీయన. ఈ ఎన్నికల లెక్కింపులో తీవ్ర దుమారం చెలరేగింది. చివరికి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ద్వారా అతి తక్కువ మెజారిటీతో గెలిచిన ఆయన.. రాష్ట్రపతి హోదాలో తొలిసారి సుప్రీంకోర్టు ఎదుట హాజరై తన వాదన వినిపించుకున్నారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇలా
అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా వ్యవహరించింది హిదయతుల్లా. 1969 జులై 20 నుంచి ఆగస్టు 24 వరకు రాష్ట్రపతిగా పని చేశారు. జాకీర్హుస్సేన్ మరణ తర్వాత అప్పటి ఉపరాష్ట్రపతి వీవీ గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా ఎంపికయ్యారు. తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే నిమిత్తం రెండు పదవులకు రాజీనామా చేయడంతో..అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న హిదయతుల్లా నెలపాటు ఈ పదవిని అలంకరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ.. రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి వ్యక్తి కూడా ఈయనే.
నీలం ఇలా.. వీవీ గిరి అలా
ప్రథమ పౌరుని పదవి అలంకరించిన వారిలో ఇద్దరు తెలుగువారున్నారు. ఆరో రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నీలం సంజీవరెడ్డి అచ్చ తెలుగు, ఆంధ్రప్రదేశ్ వాసి. ఆయన అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో జన్మించారు. మరో ప్రథమ పౌరుడు వీవీగిరి (వరాహగిరి వెంకటగిరి) తెలుగువారే. ఈయన స్వస్థలం బెర్హంపూర్ (నేటి బరంపురం). తర్వాత అది ఒడిశా రాష్ట్రంలోని వెళ్లింది.
రాష్ట్రపతి అంటే ఇలా...
రాష్ట్రపతి అంటే రాజ్యాంగ పరిరక్షకుడు. అందుకే రాజ్యాంగాన్ని ఔపోసన పట్టిన న్యాయకోవిదులే ఎక్కువమంది ఆ పీఠాన్ని అలంకరించి వన్నె తెచ్చారు. ఇప్పటి రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్, ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ సహా ఎక్కువ మంది ఆ కోవలోని వారే. అందులో మొదటి వారు, భారతదేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్. ఈయన కోల్కతా విశ్వవిద్యాలయంలో ఎంఎల్ చేశారు. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పీహెచ్డీ పూర్తిచేశారు. వి.వి.గిరి కూడా డబ్లిన్ విశ్వవిద్యాలయంలో బారెట్ లా చదివారు. పకృద్దీన్అహ్మద్ కూడా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బారెట్ లా చదివారు. మరో రాష్ట్రపతి శంకర్దయాళ్ శర్మ కూడా లఖ్నవూ విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎంఎల్ చదివారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేశారు. మరో ప్రథమ పౌరుడు ఆర్ వెంకటరామన్ కూడా న్యాయవాదే. ఆయన మద్రాసు న్యాయ కళాశాలలో పట్టా పొంది, మద్రాసు హైకోర్టులో న్యాయవాది వృత్తి చేపట్టారు. ఇక ప్రస్తుతం అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కూడా కాన్పూర్ కళాశాలలో లా పట్టా పొందారు. దిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో దాదాపు 16 ఏళ్లపాటు న్యాయవాదిగా పనిచేశారు.