చిరు బిజెపిలో చేరాలని పవన్: వెంకయ్య ప్రయత్నం
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారా? ఇప్పుడు ఈ విషయమై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెసు పార్టీలో పలువురు ప్రముఖుల స్థానంపై చర్చ సాగుతోంది. అందులో చిరంజీవి 'స్థానం'పై కూడా చర్చ జరుగుతోంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు చిరంజీవి బిజెపిలో చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే అది జరగలేదు. సరికాదా ఆయనకు కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర ప్రచార బాధ్యతలను అప్పగించింది. కానీ సీమాంధ్రలో పార్టీ ఒక్క ఎమ్మెల్యేను కానీ, ఒక్క ఎంపీని గానీ గెలువలేకపోయింది.
టిడిపి, బిజెపి కూటమికి ప్రచారం చేసిన చిరంజీవి తమ్ముడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పార్టీలకు రియల్ హీరో అయ్యాడు. కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనను ప్రత్యేకంగా చూస్తున్నారు. ఆయనను రాజ్యసభకు పంపించే యోచనలోను మోడీ ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చిరంజీవి బిజెపిలో చేరితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. దానినే ఆయన దృష్టికి ఇతరుల ద్వారా తీసుకెళ్లారని, ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు మెగాస్టార్ను బిజెపిలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.
పవన్ కళ్యాణ్ బిజెపికి ఆంధ్రప్రదేశ్లో నూతనోత్సాహం ఇచ్చారు. పవన్కు చిరంజీవి కలిస్తే అది తమకు మరింత కలిసి వస్తుందని బిజెపి భావిస్తోంది. పరిస్థితి చూస్తుంటే మరో పదేళ్ల వరకు కాంగ్రెసు పార్టీ ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదని, ఇలాంటి స్థితిలో బిజెపిలో చేరడం చిరంజీవి ఇష్టంపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.