సత్తా ఉందా, అధిష్టానం ప్లానా: కిరణ్ ఏం చేస్తారు?
హైదరాబాద్: తెలంగాణపై నోట్ రాదని, 2014 ఎన్నికల వరకు రాష్ట్ర విభజన జరగదని ఇప్పటి వరకు ధీమాగా ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తారనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. అధిష్టానం విభజన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు. విభజనపై తాము ముందుకు వెళ్తామని ఢిల్లీ పెద్దలు చెబుతున్నప్పుడల్లా తనను కలిసిన సీమాంధ్ర నేతలతో కిరణ్ మాత్రం అలా జరగదని చెబుతూ వస్తున్నారు.
గురువారం సాయంత్రం వరకు తనను కలిసిన సీమాంధ్రులకు కేబినెట్ నోట్ రాదని చెబుతూ వచ్చారు. అయితే అధిష్టానం గోప్యత పాటించి టేబుల్ ఐటంగా తీసుకు వచ్చి తెలంగాణ నోట్ను ఆమోదించింది. కేబినెట్ నోట్ రాదని, విభజన జరగదని ధీమాగా ఉన్న కిరణ్కు ఇది పెద్ద షాక్. అయితే ఇప్పుడు ఆయన ఏం చేస్తారనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది.
కేంద్రం నిర్ణయాన్ని ఆయన ఎలా వ్యతిరేకిస్తారు, విభజనపై భగ్గుమంటున్న సీమాంధ్ర నేతలను ఎలా కూడగట్టి పార్టీ అధిష్టానానికి బలమైన సంకేతం పంపుతారు, అసలు సిఎంకు ఆ శక్తి ఉందా, అసలు ఆయన ఆ పదవిలో కొనసాగుతారా, దానిని వ్యతిరేకించేలా చట్టసభలోనే రాజీనామా చేస్తారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ ప్రశ్న కాంగ్రెసు, సీమాంధ్ర కాంగ్రెసు నేతలతో పాటు రాజకీయ వర్గాల్లోను ఆసక్తి నెలకొంది.
అదే సమయంలో విభజన జరగదని చెబుతున్న కిరణ్.. అధిష్టానం వ్యూహంలో భాగంగానే ఇలా మాట్లాడుతున్నారేమోననే అనుమానాలు కూడా కొందరిలో ఉన్నాయి. తనను కలిసిన పలువురితో ముఖ్యమంత్రి పలు ఆసక్తికర విషయాలు చెబుతున్నారట. తాను కోర్ కమిటీకి చాలా చెప్పానని, అందులో పావు వంతు మాత్రమే ఇప్పటి దాకా విలేకరుల సమావేశాల ద్వారా బయటకు వచ్చిందని మిగిలిన అంశాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పబోతున్నారట.