షాక్: 8 ఏళ్లలో కుప్పకూలనున్న ఇంటర్నెట్?
లండన్: ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ.. నిత్యం భారీ ఎత్తున పెరిగిపోతున్న వినియోగం నేపథ్యంలో ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం లేకపోలేదని బ్రిటన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో ఎనిమిదేళ్లలో ఈ పరిస్థితిలు తలెత్తవచ్చునని చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా నిత్యం భారీ ఎత్తున ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇంటర్నెట్ సామర్థ్యం దాని పరిమితులను చేరుకుంటోందని, ఆ పరిమితిని దాటి సామర్థ్యాన్ని ఇంకా పెంచటం సాధ్యం కాదన్నారు.
మన ల్యాప్టాప్లకు, స్మార్ట్ఫోన్లకు, ట్యాబ్లెట్లకు సమాచారాన్ని చేరవేస్తున్న కేబుళ్లు, ఫైబర్ ఆప్టిక్స్ సామర్థ్యం మరో ఎనిమిదేళ్లలో గరిష్ఠస్థాయికి చేరుకుంటుందని, ఒక ఆప్టికల్ ఫైబర్లోంచి అంతకుమించిన సమాచారాన్ని పంపించటం ఇక వీలుకాదని ప్రొఫెసర్ ఆండ్య్రూ ఎలిస్ తెలిపారు.
ముంచుకొస్తున్న ఈ ముప్పును ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై ఆండ్య్రూ ఈ నెల 11న లండన్లోని రాయల్ సొసైటీలో ఒక సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీంట్లో ప్రముఖ ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, టెలికం సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.
సమాచార డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సామర్థ్యాన్ని కూడా పెంచుతూ వస్తున్నారని, ఇది అన్ని సమయాల్లో సాధ్యం కాదని ఆండ్రూ ఎలిస్ అంటున్నారు. ఇంటర్నెట్ టెలివిజన్, శక్తిమంతమైన కంప్యూటర్లు వంటివి సమాచార వ్యవస్థ మీద తీవ్రమైన భారం వేశాయన్నారు.