జగన్ ఆత్మీయ విందు: ఎమ్మెల్యేలకు భరోసా
కడప: పార్టీ వీడుతున్న శాసనసభ్యులను కట్టడి చేయడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించారు. శానససభ్యులను కాపాడుకోవడానికి ఏం చేయాలనే విషయంపై చర్చించడానికి ఆయన కడప జిల్లా పులివెందులలో ఆత్మీయ విందు ఏర్పాటు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి ఒక్కరొక్కరే మారిపోతున్నారు. ఇప్పటికే 11 మంది శానససభ్యులు సైకిలెక్కేశారు. మరింత మంది టిడిపిలోకి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. ఇది వైయస్ జగన్కు ప్రాణసంకటంగా మారింది. పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ జగన్ అంతర్గతంగా మాత్రం పార్టీని రక్షించుకునే ప్రయత్నాల గురించి తీవ్రంగా ఆలోచన చేస్తున్నారు.
పులివెందులలో మకాం చేసి పార్టీ ఎమ్మెల్యేలను రక్షించుకునే వ్యూహానికి పదును పెడుతున్నారు. విందులూ వినోదాలకు దూరంగా ఉండే జగన్ అందుకు భిన్నంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నెల 4వ తేదీ రాత్రి పులివెందులలోని సొంత ఇంట్లో "ఆత్మీయవిందు'' పేరుతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ విందుకు సొంత జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులను ఆహ్వానించారు.

ఆత్మీయ విందుకు హాజరైన పార్టీ శాసనసభ్యులను ఉద్దేశించి జగన్ మాట్లాడినట్లు చెబుతున్నారు. పార్టీ మారాలనే యోచనను విరమించుకోవాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జగన్ రకరకాల మార్గాల్లో రాయబారాలు కూడా నడుపుతున్నారని వినికిడి.
ఆర్థిక పరిస్థితి బాగాలేని ఎమ్మెల్యేలను గుర్తించి, వారికి అవసరమైన సాయం చేసేందుకు సిద్ధపడుతున్నారని సమాచారం. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అందుకు ముందుకు వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. కర్నూలు జిల్లాలో వలసలు పెరుగుతున్నాయని, అక్కడ ఆర్ధిక పరిస్థితి బాగాలేని తమ ఎమ్మెల్యేలను ఆదుకోవలసిందిగా గాలి జనార్దన్ రెడ్డిని జగన్ కోరినట్లు చెబుతున్నారు.
ఈ మేరకు గాలి సన్నిహితుడు శ్రీరాములు బళ్లారిలో ఈ వ్యవహారాన్ని చక్కబెట్టే పనిలో నిమగ్నమైనట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అది ఏ మేరకు ఫలితాలు ఇస్తుందనేది చెప్పలేని వాతావరణమే ఉంది.












Click it and Unblock the Notifications