పైయెత్తు: చంద్రబాబు వ్యూహానికి జగన్ విరుగుడు?
హైదరాబాద్: జంప్ జిలానీల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఎత్తుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైయెత్తు వేసినట్లు కనిపిస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాష్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతున్న నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు టిడిపిలో చేరుతున్నారంటూ పెద్ద యెత్తున ప్రచారం సాగింది.
దాదాపు 9 మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు తమ పార్టీలోకి వస్తున్నారని, వారు తమను సంప్రదిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రులు, టిడిపి నాయకులు చెబుతూ వచ్చారు. దాంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కలకలం చెలరేగింది. టిడిపిలో చేరుతున్నారంటూ పేర్లు బయటకు వచ్చినవారిని కూడగట్టి వైయస్ జగన్ వారి చేత ప్రకటనలు ఇప్పించారు. టిడిపిపై ఎదురుదాడి చేయిస్తూ తాము జగన్తోనే ఉంటామంటూ వారు ప్రకటనలు చేశారు.
దాంతో ఆగకుండా చంద్రబాబును ఇరకాటంలో పెట్టి, గందరగోళంలో పడేయడానికే అన్నట్లు వైయస్ జగన్ కొత్త ప్రచారానికి తెర తీశారు. తాము ప్రభుత్వాన్ని కూలగొడుతామంటూ హెచ్చరిక చేశారు. కొంత మంది శాసనసభ్యులు తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని, 21 మంది వస్తే చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుందని ఆయన చెప్పారు.
తమతో ఎవరు టచ్లో ఉన్నారనే విషయాన్ని మాత్రం జగన్ వెల్లడించలేదు. వారి పేర్లు చెప్తే గంటలోనే చంద్రబాబు ప్రభుత్వం పడిపోతుందని ఆయన అన్నారు. వారి పేర్లు ఇప్పుడు చెప్పనని కూడా ఆయన అన్నారు. మీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారట కదా అని మీడియా ప్రతినిధులు అంటే బుద్ధి ఉన్నవాడెవడూ టీడిపిలో చేరడని అంటూ టిడిపి ఎమ్మెల్యేలే తమతో టచ్లో ఉన్నారని ఆయన నవ్వుతూ చెప్పారు. దీన్ని బట్టి చంద్రబాబు వ్యూహానికి ప్రతి వ్యూహంగానే ఆయన ఈ మాటలన్నట్లు అర్థమవుతోంది.
విజయవాడ టిడిపిలోని అంతర్గత తగాదాలను ఆయన ఈ సందర్భంగా ఉపయోగించుకున్నారు. వల్లభనేని వంశీ మీ పార్టీలోకి వస్తున్నారా అని అడిగితే ఎవరెవరు తనతో టచ్లో ఉన్నారో ఇప్పుడు చెప్పనని ఆయన వ్యూహాత్మక వ్యాఖ్య చేశారు. మొత్తం మీద, జగన్ తన వ్యాఖ్యల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి పుట్టించారు.